ఈవెంట్లు సరే.. పన్ను సంగతేమిటి?: భాగ్యనగరిలో 40 సంస్థలకు పన్నులశాఖ నోటీసులు
హైదరాబాద్: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిర్వహించిన కార్యక్రమాలకు కచ్చితంగా పన్ను కట్టాలని ముందే హెచ్చరించినా పలువురు ఈవెంట్ నిర్వాహకులు స్పందించకపోవడంతో పన్నుల శాఖ రంగంలోకి దిగింది. పన్నుల శాఖ అధికారులు 40 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ నగరం అంతా గాలించారు. గత నెల 30, 31 తేదీలలో నగరంలో జరిగిన ఈవెంట్ల వివరాలు సేకరించారు. ఈవెంట్లు జరిగిన ప్రదేశాల యజమానులు, ఈవెంట్ల నిర్వాహకులకు నోటీసులిచ్చారు. మొత్తంగా 40 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
మరో వైపు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి రాష్ట్రంలో పలు చోట్ల ఈవెంట్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈవెంట్లలో మద్యం అమ్మకాలకు కూడా పర్మిషన్లు ఇవ్వడంతో అమ్మకాలు పెరిగినట్టు తెలిసింది. మద్యం షాపుల యజమానులకు అబ్కారీ శాఖ అధికారులు టార్గెట్లు విధించి అమ్మకాలు జరిపించారు.
కోట్లలో ఆదాయం లభిస్తుందని పన్నుల శాఖ అధికారుల ఆశాభావం
న్యూ ఇయర్ ఈవెంట్లన్నీ పన్ను పరిధిలోకి వస్తాయని, టీజీఎస్టీ, సీజీఎస్టీ చట్టాల్లోని సెక్షన్ 25 (1) ప్రకారం ఈవెంట్ల నిర్వాహకులు రిజిస్టర్ చేసుకుని పన్ను కట్టాలని పన్నుల శాఖ కమిషనర్ అనిల్కుమార్ గత నెల 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రకారం పన్నుల శాఖ కార్యాలయంలో ఈవెంట్లను రిజిస్టర్ చేయించుకుని ముందస్తు పన్ను చెల్లించాలి. ఈ మేరకు ఈవెంట్ల ఆన్లైన్, ఆఫ్లైన్ టికెట్ల అమ్మకాలు, అగ్రిమెంట్ ప్రతుల వివరాలు సేకరించారు. తమకు లభించిన సమాచారం ప్రకారం నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. పన్నుల శాఖ బృందాలు 40 సంస్థలకు నోటీసులు ఇచ్చాయి. జాబితాలో ప్రముఖ క్లబ్లు, హోటళ్లు ఉన్నాయి. రామోజీ ఫిలింసిటీ నుంచి జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్, ఫిలింనగర్ కల్చరల్ క్లబ్, కంట్రీక్లబ్, ఫలక్నుమా ప్యాలెస్ తదితర ప్రముఖ పర్యాటక ప్రదేశాలకూ నోటీసులిచ్చామని శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ల పన్ను రూ.కోట్లల్లో వస్తుందని, చట్టం ప్రకారం నోటీసులిచ్చామని అధికారులు చెబుతున్నారు.
సర్కార్కు భారీగా ఆదాయం సమకూర్చిన మద్యం ప్రియలు
డిసెంబర్ 31న జరిగిన గ్రాండ్ పార్టీల్లో గచ్చిబౌలిలోని సన్బర్న్ క్లబ్దే అగ్రస్థానమని పన్నుల శాఖ పరిశీలనలో తేలింది. నగరంలోని ప్రముఖ క్లబ్లు, హోటళ్లలో వందల సంఖ్యలో ఈవెంట్లు జరిగినా సన్బర్న్ ఈవెంట్లో 90 శాతానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయని పన్నుల శాఖ వర్గాలు చెప్తున్నాయి. చట్ట ప్రకారం ఈవెంట్ నిర్వాహకులు పన్ను చెల్లించాల్సిందేనని సన్బర్న్ నిర్వాహకుడు రిజిస్టర్డ్ డీలర్ కావడంతో చెల్లింపులో ఇబ్బంది తలెత్తే అవకాశం లేదంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నూతన సంవత్సర ‘బొనాంజ' తగిలింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మద్యం ప్రియులు అధిక మొత్తంలో తాగి సర్కార్ ఊహించనంతగా ఆదాయాన్ని సమకూర్చారు.
రూ.500 కోట్ల ఆదాయం లభిస్తుందని ఎక్సైజ్ అంచనాలు
2017 డిసెంబర్ చివరి వారంలో కేవలం మూడంటే మూడురోజుల్లో రూ.420 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. డిసెంబర్ 31న రూ.130 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2016 డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.319 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2016 డిసెంబర్ చివరి మూడు రోజుల ఆదాయంతో పోలిస్తే 2017 డిసెంబర్ చివరి మూడు రోజుల్లో సర్కార్కు రూ.101 కోట్లు అదనపు ఆదాయం సమకూరింది. మద్యం అమ్మకాలతో ఖజానా ఎంతగా నిండింది. తాగుబోతులను పట్టుకుని ఎన్ని కోట్ల మేర చలానాలు వచ్చాయని లెక్కలేసుకోవటంలో అధికారులు బిజీ అవుతున్నారు. ఎక్సైజ్ శాఖ అంచనాల ప్రకారం డిసెంబర్ చివరి వారంలో రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావించారు. కాని గోదాంలలో మద్యం నిల్వలు పూర్తి స్థాయిలో ఉంటే లక్ష్యానికి చేరుకునేవారమని ఎక్సైజ్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.