అనంతగిరిలో టీబీ హాస్పిటల్ కొనసాగింపు.. కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు
వికారాబాద్ : తెలంగాణ ఊటీగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండల్లో త్వరలోనే ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణి వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో పర్యటించారు. టీబీ ఆసుపత్రితో పాటు వార్డులను, ఇతర భవనాలను పరిశీలించారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్న ఆయూష్ ఆరోగ్య కేంద్రం అనంతగిరిలో ఏర్పాటు చేయబోతుండటం హర్షణీయమని అన్నారు.
అనంతగిరిలో కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గతంలో ఇక్కడ ఉన్న టీబీ ఆసుపత్రిని సైతం కొనసాగిస్తామన్నారు. ఇదివరకు టీబీ హాస్పిటల్ మరమ్మతులకు విడుదలైన నిధులను సక్రమంగా ఉపయోగించకపోవడంతోనే ఇక్కడి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని చెప్పుకొచ్చారు.
ఫోన్లు లిఫ్ట్ చేయరా.. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై రేవంత్ రెడ్డి గరం..!
ఆయూష్ ఆరోగ్య కేంద్రం ప్రారంభించడానికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరయినట్లు చెప్పారు ఎమ్మెల్యే. విడతల వారీగా ఆయూష్ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆ క్రమంలో ఆయూష్ ఆరోగ్య కేంద్రానికి అవసరమైన భవన నిర్మాణాలకు, మరమ్మతులకు విడుదలైన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామన్నారు.
ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణి ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల కిందట ఇక్కడ టీబీ హాస్పిటల్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం టీబీ రోగులు బాగా తగ్గారని... అయినప్పటికీ పేషెంట్ల బాధలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఆసుపత్రి కొనసాగిస్తామని తెలిపారు. కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఇక్కడ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో అనంతగిరిలో అవసరమైన భవనాలు, సిబ్బంది, మౌలిక వసతులు అన్నింటిని త్వరలోనే సమకూర్చే ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీబీ ఆస్పత్రి సూపరిటెండెంట్ సుధాకర్ షించే, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.