టీసీ చెకింగ్: రైలు నుంచి పడి యువకుడు మృతి, టీసీని చితకబాదారు
వికారాబాద్: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. టీసీ నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు రైలు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా గొల్లగూడ రైల్వేస్టేషన్లో శనివారం చోటుచేసుకుంది.
టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువకుడు టీసీని చూసిన వెంటనే అతని నుంచి తప్పించుకునేందుకు రైలు నుంచి దూకినట్టు సమాచారం. అయితే, రైలు నుంచి దూకే ముందు టీసీ అతని కాలర్ పట్టుకున్నట్లు తెలిసింది.
దీంతో అదుపుతప్పి రైలు కింద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు యువకుడు. ఈ ఘటనకు టికెట్ కలెక్టర్ను బాధ్యుడిగా పేర్కొంటూ తోటి ప్రయాణికులు అతడిని చితకబాదారు.
కాగా, మృతుడు వికారాబాద్ పరిధిలోని లక్ష్మీతండా వాసిగా కాట్రావత్ శివగా గుర్తించారు. వికారాబాద్లోని ఎస్ఏపీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన శివ ప్రస్తుతం కానిస్టేబుల్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. అతడు ఆదివారం జరిగే వీఆర్వో పరీక్ష కోసం హైదరాబాద్కు వెళ్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.