కెటిఆర్ను సీఎంను చేసేందుకే కెసిఆర్ పాట్లు: వంటేరు, ‘రైతులు చనిపోతుంటే యాగాలా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండ్డిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణన కేసీఆర్ 18 నెలల్లో అప్పులపాలు చేశారని ఆరోపించారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనయుడు కెటి రామారావు, మేనల్లుడు హరీష్రావుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని చెప్పారు. కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ రంగం సిద్దం చేస్తున్నారని అన్నారు.
అలాగే త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కేటీఆర్కు ఫ్రీ ఫైనల్గా మారనున్నాయని వ్యాఖ్యానించారు.
రైతులు చనిపోతుంటే చండీయాగానికి కోట్లు ఖర్చు చేస్తున్నారు: కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో ఓ పక్క రైతులు చనిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చండీయాగాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురష్కరించుకుని క్రిస్టియన్ భవనం శిలాఫలకం దగ్గర కాంగ్రెస్ నేతలు క్రిష్టమస్ వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకల్లో కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు షబ్బీర్అలీ, నేతలు దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, మర్రి శశిధర్రెడ్డి, సర్వే సత్యనారాయణతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు.. గత క్రిస్మస్ సందర్బంగా క్రిస్టియన్ భవన్ను నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఏడాదవుతున్నా నేటికీ భవనాన్ని ప్రారంభించలేదన్నారు.
అలాగే రాజులు చేసే యాగాలను కేసీఆర్ నిర్వహిస్తున్నారన్నారు. చండీయాగం ఖర్చు ఎంతో లెక్క చెప్పాలన్నారు. అలాగే హైదరాబాద్ కు గోదావరి జలాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఎన్నికల కోసమే హైదరాబాద్లో శిలాఫలకాలు వేస్తున్నారన్నారు.