తెలంగాణపై చంద్రబాబు 'బిగ్' ప్లాన్: కాంగ్రెస్ గెలిస్తే అధికారంలోను భాగస్వామ్యం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై దాదాపు ఈ రోజు తేలిపోనుంది. ఇప్పటికే ఏపీ సీఎం పలువురు నేతలతో చర్చించారు. శనివారం తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ టార్గెట్గా కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో పాలుపంచుకోవాలనుకుంటున్నారు.
కేసీఆర్ తర్వాత తెలంగాణలో ఏపీ సీఎం రికార్డ్!: చంద్రబాబుకు ఉత్తమ్ 15 సీట్లు ఆఫర్
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేస్తే కేసీఆర్కు షాక్
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ సహా కలిసి వచ్చే పార్టీలతో మరోసారి మహాకూటమి ఏర్పాటు చేయాలని పలువురు టీడీపీ నేతలు కోరారు. తెరాస, బీజేపీయేతర పార్టీల్లో తమతో కలసి వచ్చే వారితో పొత్తుతో ముందుకు వెళ్లాలని చెప్పారు. తెరాస ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓట్ల రూపంలో ప్రతిపక్షాల మధ్య చీలిపోకుండా పోటీ చేస్తేనే కేసీఆర్కు షాకివ్వవచ్చునని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
టీడీపీకి రాజకీయంగా మేలు జరిగేలా
తెలంగాణకు, టీడీపీకి రాజకీయంగా మేలు జరిగేలా పొత్తులపై నిర్ణయాలు ఉండాలని టీడీపీ భావిస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై తెలంగాణ టీడీపీ నేతలతో అధినేత ఎప్పటికి అప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన వ్యూహాలతో పాటు, నేతల వ్యూహాలను కూడా అడుగుతున్నారు.
అన్నింటిపై చర్చలు
పొత్తులపై తెలంగాణ టీడీపీ నేతలు.. చంద్రబాబు రాకకు ముందే పలువురితో చర్చించారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి వెళ్లడమే మంచిదని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అయితే మరింత చర్చ జరగాల్సి ఉందని చెబుతున్నారు. పొత్తుతో పాటు సీట్ల పంపకాలపై కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి.
దాదాపు 40 చోట్ల బలం
తెలంగాణలో టీడీపీ ఎక్కడెక్కడ బలంగా ఉందనే అంశాలపై తెలంగాణ టీడీపీ నేతలు వివరించి, అక్కడ పోటీ చేస్తామనే ప్రతిపాదన తీసుకురానున్నారు. పొత్తుల అంశం తేలాక చంద్రబాబుతో పలుచోట్ల బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కేసీఆర్ వైఫల్యాలను ఈ సభల ద్వారా చెప్పనున్నారు. తెలంగాణలో దాదాపు నలభై స్థానాల్లో టీడీపీ బలంగా ఉందని, ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీచేస్తే గెలుపు తథ్యమని తెలంగాణ టీడీపీ నేతలు అంటున్నారు.