'అన్నీ ఆలోచించే ఆమెను తీసుకొచ్చాం': అసంతృప్త నేతలకు సుహాసిని ఫోన్, మద్దతుకు ఓకే
హైదరాబాద్: తాము అన్ని విషయాలు ఆలోచించే నందమూరి సుహాసినిని రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ శుక్రవారం చెప్పారు. సుహాసిని కూకట్పల్లి బరిలో ఉండటం తమకు చాలా సంతోషమని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది హైదరాబాదులో అని, ఆయన ఆత్మ తెలంగాణలోనే ఉందని చెప్పారు.
తెలంగాణకు అనుకూలంగా ఉంటే నష్టమని తెలిసినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం కోసం తన పార్టీ, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లారని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వస్తామని చెప్పారు. ఇప్పటి వరకు తాము 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించామని చెప్పారు.
Recommended Video
సుహాసినిని ఆశీర్వదించండి
తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు మాసాబ్ ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి వెళ్లి సుహాసినిని కలిశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగానే రమణ మాట్లాడారు. సుహాసినిని ఆశీర్వదించి, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తారని చెప్పారు.
11 గంటలకు సుహాసిని నామినేషన్, వెంట బాలకృష్ణ
ఇదిలా ఉండగా కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని శనివారం ఉదయం 11.21 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి వెళ్లి సుహాసిని నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మందాడి, పెద్దిరెడ్డిలకు సుహాసిని ఫోన్
కూకట్పల్లి టిక్కెట్ ఆశించి, దక్కని ఇనుగాల పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాస రావుకు సుహాసిని ఫోన్ చేశారు. తన గెలుపుకు సహకరించాలని కోరారు. వారు కూడా సహకరిస్తామని చెప్పారని తెలుస్తోంది. కూకట్పల్లిలో భారీ గెలుపు కోసం ఆమె టీడీపీ సీనియర్ నేతల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా మందాడి, పెద్దిరెడ్డిలకు ఫోన్ చేశారు. వారు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
హరికృష్ణ కూతురును ఆశీర్వదించండి
కాగా, సాయంత్రం సుహాసిని మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, మామయ్య చంద్రబాబులు తనకు ఆదర్శమని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి తెదేపా సీటు కేటాయించినందుకు చంద్రబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాల కోసం చంద్రబాబు కష్టపడుతున్నారని నందమూరి రామకృష్ణ అన్నారు. హరికృష్ణ కుమార్తెను అందరూ ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.