ఏం లాభం: టీడీపీ, మజ్లిస్ ప్రతిపాదనకు కేసీఆర్ నో
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, ఆయన పేరును విమానాశ్రయానికి పెట్టడం తెలుగు ప్రజలకు గర్వకారణమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం అన్నారు.
శాసన సభ, శాసన మండలి సమావేశాలు వాడిగావేడిగా ప్రారంభమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పైన కాంగ్రెస్, తెరాస నేతలు మండిపడ్డారు. దీంతో, ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సభాపతి సభను వాయిదా వేశారు. ఈ సమావేశానికి బీజేపీ, టీడీపీలు గైర్హాజరయ్యాయి. దీనిపై టీడీపీ నేతలు మాట్లాడుతూ.. తమను మాట్లాడనివ్వప్పుడు వెళ్లి ఏం చేస్తామని చెప్పారు.
టీడీపీ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ముందు తన కొడుకు పేరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తాము అన్ని విషయాలను సభాపతి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
సభాపతిని కలిసి టీడీపీ సభ్యులు
టీడీపీ సభ్యులు సభాపతిని కలిశారు. బీఏసీకి తమ పార్టీ నుండి ఒకరిని మాత్రమే పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎల్ఎఫ్, విద్యుత్ అంశాలను సభాపతి దృష్టికి తీసుకు వచ్చారు.
రాజీవ్ పేరు కొనసాగించాలి: డీకే అరుణ
విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరును కొనసాగించాలని డీకే అరుణ అన్నారు. అదే పేరు కొనసాగించాలని తాము అసెంబ్లీలో తీర్మానం పెడతామన్నారు.
ఎయిర్ పోర్ట్ వద్ద ధర్నా
విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు వి హనుమంత రావు తదితరులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముగిసిన అఖిల పక్ష భేటీ
సభాపతితో అఖిల పక్ష భేటీ ముగిసింది. విమానాశ్రయం పేరు మార్పు పైన చర్చించారు. రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలని కాంగ్రెస్, తెరాసలు నిర్ణయించాయి. ఎన్టీఆర్ పేరును వ్యతిరేకిస్తూ, రాజీవ్ పేరు కొనసాగించాలని సభలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. అంతకుముందు సీపీఎం కొమురం భీమ్ పేరును, మజ్లిస్ పార్టీ హుస్సేన్ షా పేరును సూచించాయి. అయితే, కొత్త పేర్లతో మరో వివాదం తీసుకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. దీని పైన కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.