తాగుబోతు కెసిఆర్: రెచ్చిపోయిన 'చిచ్చరపిడుగు', కెటిఆర్కు ధీటుగా (పిక్చర్స్)
హైదరాబాద్: నిజాం కళాశాల మైదానంలో జరిగిన టిడిపి - బిజెపి బహిరంగ సభ విజయవంతం కావడం మిత్రపక్షాల శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ సభ వేదికగా టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, బిజెపి శాసనసభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్, టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి తదితరులు కెసిఆర్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు.
టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అయితే కెసిఆర్ను ఏకిపారేశారు. టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ... 'చిచ్చరపిడుగు రేవంత్ మాట్లాడుతారని' ప్రకటించినప్పుడు అందరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాట్లాడేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి ఊగిపోయారు.
హైదరాబాద్, తెలంగాణ చంద్రబాబు వల్లే ధనిక రాష్ట్రమయిందని చెప్పారు. చంద్రబాబు చెమట వల్లే హైదరాబాద్ ప్రపంచస్థాయి రాజధానిగా ఎదిగిందన్నారు. మురికి కాలువల గురించి తెరాస నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. చంద్రబాబు 11 నెలల్లో హైటెక్ సిటీ కడితే.. ఆ హైటెక్ సిటీ ముందు.. వారు అధికారంలోకి వచ్చి 19 నెలలు అయినా మురికి కాల్వ ఎందుకు కట్టలేదని నేను ప్రశ్నిస్తున్నానని నిలదీశారు.
తాగుబోతు కెసిఆర్ వల్ల తెలంగాణ రాలేదు
ఎక్కడికైనా కెటిఆర్ వస్తే, నేను వస్తానని, కెసిఆర్ వస్తే చంద్రబాబు వస్తారని, కెసిఆర్ తన తాతను తీసుకు వస్తే ప్రధాని మోడీని తీసుకు వస్తామని వ్యాఖ్యానించారు. మీడియా కూడా సభకు వచ్చిన జనాన్ని, బయట నిలబడిన ఇంతకు మూడొంతుల జనాన్ని ప్రజలకు చూపించాలని విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ ఫాంహౌస్లో పడుకుంటారని మండిపడ్డారు. తెలంగాణ తాగుబోతు కేసిఆర్ వల్ల రాలేదని, యువకుల బలిదానాల వల్ల, అన్ని పార్టీలు కలిసి పోరాడటం వల్ల వచ్చిందన్నారు.
అది చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే చంద్రబాబు కృష్ణా - గోదావరి నదులను అనుసంధానం చేశారని, మరి ఇక్కడ కెసిఆర్ ఏంచేశారని నిలదీశారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీని ముందుకు తీసుకెళ్తున్నాడు అది చంద్రబాబు అంటే, సర్ ప్లస్లో ఉన్న తెలంగాణలో కష్టాలు తేవడం ఇది కెసిఆర్ అంటే అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాదుకు చాలా డబ్బులు ఉన్నాయని, వాటితో ఎంతో అభివృద్ధి చేయవచ్చన్నారు.
కెసిఆర్ అరాచకాలు రాసేందుకు...
కెసిఆర్ అరాచకాలు రాసేందుకు పేపర్, టీవీ మీడియా ముందుకు రావడం లేదని, దీనిని బట్టే ఆయన ఎంత అరాచకవాదో తెలుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాల మేరకు వినాయక నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్లో వద్దని నాడు కెసిఆర్ ఆదేశిస్తే.. అందరం కొట్లాడామని చెప్పారు. చంద్రబాబు తెచ్చిన గూగుల్ వద్దకు వెళ్లి కెటిఆర్ ఫోజులు కొడుతున్నారన్నారు.
కెసిఆర్వి అన్నీ అబద్దాలే
కెసిఆర్ అన్నీ మాటలు తప్పుడేనని మండిపడ్డారు. దళితుల్ని సీఎం చేస్తానని చేయలేదని, ఓయులో పేదలకు ఇళ్లు అని చెప్పి కట్టించలేదని, సచివాలయం కట్టిస్తానని కట్టించలేదని, ఆసుపత్రి తరలిస్తానని తరలించలేదని, స్కైవేలు నిర్మిస్తామని నిర్మించలేదని, హుస్సేన్ సాగర్ వద్ద వంద అంతస్తుల భవంతి అని చెప్పి మాటలకే పరిమితమయ్యారని రేవంత్ రెడ్డి దుమ్మెత్తి పోశారు. కెసిఆర్ అన్నీ త్రీడీ బొమ్మలు చూపించారని ఎద్దేవా చేశారు.
కెటిఆర్కు సవాల్
కెటిఆర్ సవాల్ను నేను స్వీకరిస్తున్నానని, గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 100 సీట్లలో గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఈ సభా వేదికగా తాను ఆ సవాల్ స్వీకరిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే నీవు చెబితే.. నేను తెలంగాణ వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి ధీటుగా స్పందించారు. కెటిఆర్ సవాల్ పైన నిలబడాలన్నారు. తొలుత తెరాస కార్యాలయం పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మార్చాలని, ఈ తన సవాల్కు ఇప్పటి వరకు వారు స్పందించలేదన్నారు. తెలంగాణలో చదవని కెటిఆర్కు ఇక్కడ చప్రాసీ ఉద్యోగం చేసే అర్హత కూడా లేదన్నారు.
హరీష్ రావు ఆటలో అరటిపండు
కెసిఆర్, కెటిఆర్ ఆటలో హరీష్ రావు అరటి పండు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్ రావు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదన్నారు. కెసిఆర్ భోళాశంకరుడు అని కవిత చెబుతున్నారని... హరీష్ రావుకు కాలువలు, చెరువులు, కెటిఆర్కు ఐటీ, కవితకు బతుకమ్మ ఇచ్చారని అందుకే ఆయన భోళాశంకరుడు అన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం భోళా కాదని కౌంటర్ ఇచ్చారు.