'గ్రేటర్లో టిడిపి-బిజెపికి 90 సీట్లు, తెరాసకు 10 సీట్లు రావని తేలింది'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ కూటమికి 80 నుంచి 90 సీట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మాగంటి గోపినాథ్ బుధవారం ధీమా వ్యక్తం చేశారు. తెరాస చేసిన సర్వేల్లో వారికి 5-10 సీట్లు కూడా రావడం లేదన్నారు.
ఈ నెల 9న నిజాం కాలజీ మైదానంలో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. టిడిపి హయాంలో క్లీన్ సిటీగా ఉన్న హైదరాబాదును ఇప్పుడు తెరాస ప్రభుత్వం చెత్త నగరంగా మార్చిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిడిపి నేత విజయ రమణారావు ఆరోపించారు. కేంద్రం ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలను పంపించడం లేదన్నారు. కెసిఆర్ కుటుంబ పాలన పైన ప్రజలు త్వరలో తిరుగుబాటు చేస్తారన్నారు.
కరీంనగర్ జిల్లాలో ప్రకృతి సంపదను ముఖ్యమంత్రి కెసిఆర్ తన అనుచరులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగును ప్రజలు వ్యతిరేకించాలన్నారు.
హిందూవాదం పేరుతో పోటీ చేస్తాం: రాజాసింగ్
బిజెపిలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అన్నారు. బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గ్రూపులను కట్టడి చేసే ప్రయత్నం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి డివిజన్లో నాలుగు గ్రూప్లు తయారయ్యాయన్నారు. తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వకుంటే హిందూవాదం పేరుతో పోటీ చేయిస్తానని చెప్పారు. ఈ విషయమై శివసేన, హిందుత్వ పార్టీలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.