టీడీపీ క్యాడర్ మనసులో మాట: ప్రచారానికి లోకేష్ వద్దు... జూనియరే ముద్దు
తెలంగాణలో ప్రజాకూటమి తరపున ప్రచారానికి చంద్రబాబు ఎంటర్ అయిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు పలు కోణాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థిగా దివంగత నేత హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దింపారు. సుహాసినిని బరిలోకి దింపడం చంద్రబాబు రాజకీయంలో భాగంగానే జరిగిందని టీఆర్ఎస్ నేత తాజామాజీ మంత్ర కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఆమెను రాజకీయ బలిపశువును చేసేందుకే చంద్రబాబు పూనుకున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలని క్యాడర్ బలంగా కోరుకుంటోంది. అదే సమయంలో లోకేష్ ప్రచారానికి రావద్దని క్యాడర్ కోరుకుంటోంది. ఇప్పటికే కూకట్ పల్లి నియోజకవర్గంలో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తున్న టీడీపీ క్యాడర్
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం వరుసగా ఐదు రోజుల పాటు ప్రజాకూటమి తరపున ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరిగింది. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సుహాసిని ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఈసీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. ఇప్పటికే పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉండటంతో తెలుగుదేశం క్యాడర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వైపే చూస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూకట్ పల్లిలో ప్రచారం చేస్తే ఫలితాలు టీడీపీకి అనుకూలించే అవకాశం మెండుగా ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాను ప్రచారానికి రాలేనని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే తన సోదరి సుహాసినిని మాత్రం భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె నామినేషన్ వేసిన రోజునే ట్విటర్ ద్వారా ప్రజలను కోరారు జూనియర్ ఎన్టీఆర్.
లోకేష్ ప్రచారం చేస్తే కూకట్ పల్లి సీటు వదులుకోవాల్సిందేనా..?
నారా లోకేష్ ప్రచారం చేస్తే ఎలాగుంటుందన్న ప్రశ్నకు క్యాడర్ నుంచి వేరుగా సమాధానం వస్తోంది. చంద్రబాబు ప్రచారం చేసినప్పటికీ విజయావకాశాలపై పూర్తిగా నమ్మకం లేదని క్యాడర్ గుసగుసలాడుతోంది. అదే లోకేష్ ప్రచారానికి వస్తే గ్యారెంటీగా సీటు వదులుకోవాల్సిందేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ క్యాడర్. ఇందుకు ఉదాహరణ కూడా చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నారా లోకేష్ ప్రచారాన్ని తన భుజాలపై వేసుకుని చేశారని అయితే టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని గుర్తు చేస్తున్నారు.
ఏపీ రాజకీయాలకే లోకేష్ పరిమితమవుతారా...?
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకే నారాలోకేష్ ప్రచారం చేశారు. మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయడంలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రచారం చేస్తా అని లోకేష్ తెలివైన సమాధానం చెప్పే అవకాశం ఉన్నా... వాస్తవానికి నారాలోకేష్ వస్తే నష్టమే తప్ప లాభం ఉండదని క్యాడర్ భావిస్తోంది. చంద్రబాబు చినబాబును ఆంధ్రా రాజకీయాలకే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు తనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంది కానీ ప్రధాని కావాలన్న ఆశ మాత్రం లేదని చంద్రబాబు చెబుతున్నారు. అంటే చంద్రబాబు త్వరలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి లోకేష్ను ఏపీ సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.