ఐసిసి చెరలో తెలుగువాళ్లు: టిడిపి నేత అత్యుత్సాహం, తెలంగాణ మీద పైచేయి కోసమే
హైదరాబాద్: లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువాళ్లకు ఇంకా విముక్తి లభించలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కంభంపాటి రామమోహన్ రావు అత్యుత్సాహం కారణంగా వారు విడుదలైనట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలతో ఐసిస్ చెరలో ఉన్న గోపీకృష్ణ కుటుంబ సభ్యులు సంబరాలు కూడా చేసుకున్నారు.
ఐసిస్ చెరలో ఉన్న ఇద్దరు కూడా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం మీద పైచేయి సాధించాలనే ఉద్దేశంతో కంభంపాటి రామమోహన్ రావు వారి విడుదలపై సరైన సమాచారం లేకుండానే ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.
ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువాళ్లు గోపికృష్ణ, బలరాం విడుదలైనట్లు తమకు లిబియాలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి సమాచారం అందిందని కూడా చెప్పారు. వారి విడుదలకు చొరవ చూపారంటూ ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను ప్రశంసించారు కూడా.
కంభంపాటి రామమోహన్ రావు కేంద్రం తరఫున మాట్లాడుతున్నారని తాను అనుకున్నానని, ఆయన ప్రకటనతో తాను అయోమయానికి గురయ్యానని, తాను లిబియాలోని దౌత్యకార్యాలయానికి ఫోన్ చేశానని, వారు విడుదలైనట్లు తమకు ఏ విధమైన సమాచారం లేదని వారు చెప్పారని బలరాం భార్య శ్రీదేవి చెప్పారు.
తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో కూడా మాట్లాడానని, కిడ్నాపర్లతో చర్చలు జరుపుతున్నామని తమకు వారు చెప్పారని ఆమె వివరించారు. ఇద్దరి విడుదల కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని వారు చెప్పినట్లు శ్రీదేవి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ ఓయూలో పీహెచ్డీ చేసి ఏడేళ్ల క్రితం లిబియాకు వెళ్లి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గోపీకృష్ణ భార్య కళ్యాణి, కుమారుడు కృష్ణసాయి ఈశ్వర్(4), కుమార్తె జాహ్నవి(10)లతో కలిసి నాచారంలోని వీరారెడ్డి కాలనీలో నివాసముంటున్నారు.
కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన సి.హెచ్.బలరాం ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్లంలో పీహెచ్డీ చేశారు. లిబియాలో సిర్తే వర్సిటీలో పనిచేయడానికి వెళ్లారు. ఆయన భార్య పిల్లలు శ్రీదేవి, విజయ్భాస్కర్, మధుసూధన్ అల్వాల్లోని సుభాష్నగర్లో నివాసముంటున్నారు.