కాంగ్రెస్ కు చంద్రబాబు హ్యాండ్: అక్కడి వారి కోసమేనా: హుజూర్ నగర్ లో పోటీ వెనుక...!
కాంగ్రెస్ పార్టీతో మైత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు బై చెప్పేసారా. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ నివాసానికి వెళ్లి మరీ స్నేహ హస్తం అందించిన చంద్రబాబు ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేకులు..ఏపీలో తాను అధికారంలోకి రావటం ఖాయమని భావించిన చంద్రబాబుకు ఫలితాలు నిరాశ కలిగించాయి. అదే విధంగా గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కూడా ఏపీలో ప్రభావం చూపించిందనే అంచనాకు వచ్చారు. ఇక, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది.
మోదీ పోటీలేని శక్తి వంతుడిగా కనిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ తో దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే..పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో పోటీ చేయని తెలుగుదేశం ఇప్పుడు అదే తెలంగాణలో ఉప ఎన్నికలో పోటీకి దిగుతోంది. దీని ద్వారా కొత్త సమీకరణాల దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
హుజూర్ నగర్ బరిలో టీడీపీ..
తెలంగాణలో పూర్తిగా పట్టు కోల్పోయిన దశలో ఉన్న టీడీపీ ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ నల్లగొండ జిల్లా నాయకత్వం సొంతంగా పోటీ చేస్తే సత్తా చాటుతామని ముఖ్య నేతలందరూ చెప్పడంతో చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. సమావేశం అనంతరం రావుల మాట్లాడుతూ హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీడీపీ సొంతంగానే పోటీ చేస్తుందని ప్రకటించారు.
తమ సత్తా ఏంటో చూపిస్తామని
తెలంగాణాలో టీడీపీ ఎక్కడుంది అంటూ ప్రశ్నించిన వారికి.. తమ సత్తా ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా కాంగ్రెస్ కు సైతం గతంలో ఏర్పడిన మైత్రిలో భాగంగా ఇప్పుడు కూడా టీడీపీ సహకరిస్తుందని అంచనా వేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారికి ఇది షాకింగ్ గా మారింది. అయితే, రాజకీయంగా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవటంలో.. కొత్త సమీకరణాల్లో చంద్రబాబు ముందుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం కనిపిస్తోంది.
కాంగ్రెస్ తో మైత్రి..మోదీకి వ్యతిరేకంగా..
కేంద్రంలో నాటి ఎన్నికల ముందు ప్రధాని మోదీతో రాజకీయంగా విబేధించిన చంద్రబాబు నేరుగా రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి మరీ పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్ ..టీడీపీ తో పాటుగా ఇతరులను కలుపుకొని టీఆర్ యస్..బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసారు. అయితే, ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో తిరిగి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అయితే, ఏపీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు లేదు. మోదీని లక్ష్యంగా చేసుకొని జాతీయ స్థాయిలో మోదీ మాత్రం ఇక ప్రధాని కారు అనే నినాదంతో కాంగ్రెస్..ఇతర పక్షాలతో కలిసి చంద్రబాబు ప్రచారం చేసారు. ఏపీలో తిరిగి తాను అధికారంలోకి వస్తానని..కేంద్రంలో మాత్రం బీజేపీ అధికారంలోకి రాదని..ప్రధాని ఎవరనేది చంద్రబాబు నిర్ణయిస్తారని టీడీపీ నేతలు బీరాలు పలికారు. అయితే, ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. కాంగ్రెస్ తో చేతులు కలపటం కూడా ఏపీలో తమ ఓటమికి కారణంగా టీడీపీ భావించింది.
పార్లమెంట్ ఎన్నికలకు దూరం..ఉప ఎన్నికలో మాత్రం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. తెలంగాణలో జరిగిన 17 లోక్ సభ స్థానాల ఎన్నికల్లో టీడీపీ దూరంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకొని అటు కాంగ్రెస్ కు మద్దతివ్వకుండా.. ఇటు పోటీ చేయకుండా ఉండిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించింది. దీనికి జిల్లా నేతల ఒత్తిడి అని కారణంగా చెబుతున్నా..కాంగ్రెస్ తో టీడీపీ దూరం పాటిస్తుందనే సంకేతాలు ఇవ్వటంలో భాగంగానే ఈ నిర్ణయంగా ప్రచారం జరుగుతోంది.
ఎన్నికను ఆయుధంగా మలచుకొనేందుకే
ప్రధానిగా మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతన్న పరిణామాల్లో ఎక్కడా ఆయనకు వ్యతిరేకంగా అదే సమయంలో కాంగ్రెస్..మిత్ర పక్షాలకు అనుకూలంగా చంద్రబాబు ఒక్క వ్యాఖ్య చేయలేదు. తాను కాంగ్రెస్ తో లేనని చెప్పటానికి ఇప్పుడు హుజూర్ నగర్ ఎన్నికను ఆయుధంగా మలచుకొనేందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త సమీకరణాల దిశగా ఆశలు..అంచనాలు టీడీపీలో కనిపిస్తున్నాయి.