తెలంగాణలో టీడిపి, కాంగ్రెస్ పొత్తుపై చిగురిస్తున్న ఆశలు..!!
కాంగ్రెస్ టీడిపి పొత్తుకు లైన్ క్లియర్ చేసేలా అడుగులు పడుతున్నాయి. ఢిల్లీ వేదికగా రాజకీయ నేతలు అందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తీర్మానం చేసింది. ఈ రెండు పార్టీల మధ్య తెలుగు రాష్ట్రాల్లో పొత్తు కుదిరితే రాజకీయంగా పెద్ద సంచలనంగా మారుతుంది.. కాగా తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉంటుందంటూ వచ్చిన ఊహాగానాలే రాజకీయంగా పెనుదుమారాన్ని రేపాయి. ఈ నేపధ్యంలో టీడీపీనుంచి నుంచి కొంతమంది బయటకు వెళ్లిపోయారు. మరి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అనేది నిజంగా జరిగితే ప్రజలతో పాటు టీడీపీ నాయకుల నుంచి వ్యతిరేకతను ఎలా అదిగమిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్బంగా టీడిపి-కాంగ్రెస్ పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
టీడిపి, కాంగ్రెస్ పొత్తుకు మార్గం సుగమం చేయనున్న రాహుల్ పర్యటన..
రాజకీయంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు రాబోయే ఎన్నికల్లో దోస్తీ కుదుర్చుకుంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ దిశగా రాజకీయ పరిణామాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించనని విధంగా కాంగ్రెస్, టీడీపీ ఒక తాటిపైకి వచ్చే విధంగా రాజకీయ సమీకరణలు జగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాజకీయపార్టీలతో పొత్తుల అంశాన్ని స్వయంగా రాహుల్ గాంధీ ప్రస్తావించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు పార్లమెంట్ లో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన తీరు చూస్తుంటే ఆ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. అధికారం చేజిక్కించుకోవాలంటే ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని రాష్ర్ట నేతలకు కాంగ్రెస్ అధిష్టానం ఉద్బోదించినట్టు తెలుస్తోంది.
రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మిన్న అనే దిశగా చంద్రబాబు వ్యూహం..
మరోవైపు కాంగ్రెస్తో జత కట్టాలా? వద్దా అనే దానిపై చంద్రబాబు ఒక సర్వే నిర్వహించాలని అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి తీవ్ర అన్యాయం చేసిందనే ప్రచారం గత ఎన్నికల్లో టీడీపీకి బాగా కలిసొచ్చిన అంశమైంది. దీంతో ప్రజల్లో సెంటిమెంట్ మొదలై ఏపీలో కాంగ్రెస్ చిరునామా గల్లంతైంది! అయితే గడచిన నాలుగేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్.. ఏపీకి న్యాయం చేస్తామని హామీ ఇస్తోంది. ఏపీకి హోదా ఇస్తామని స్పష్టం గా చెబుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై వ్యతిరేకతతో ఉన్న టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్ దిశగా అడుగులు వేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత రావచ్చని తెలుస్తోంది.
హోదా కుదరదన్న బీజేపీకి హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ తోనే సమాధానం చెప్పించాలనుకుంటున్న బాబు..
తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్నా పర్వాలేదు కానీ... ఏపీలో పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇరు పార్టీల నేతలను వేధిస్తోంది. తెలంగాణలో ఈ రెండు పార్టీల పొత్తు వల్ల లాభదాయకమే అన్న అంచనా ఉండనేవుంది. అయితే ఇప్పుడు ఏపీలోనే పొత్తు పెద్ద సమస్యగా మారింది. ఈ రెండు పార్టీల కలయికను ఏపీ ప్రజలు ఆమోదిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా పరిణమించింది. దీనికితోడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ను పావుగా వాడుకుని చంద్రబాబు గట్టెకారనే వాదన ఉంది. దీనికితోడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ జరిగింది. ఈ నేపథ్యంలో కేవలం రాజకీయ అవసరాల కోసమే పొత్తు పెట్టుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పకుండా వస్తుందని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట! అందుకే దీనిపై సర్వే నిర్వహించేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఏపి సత్వర అభివ్రుద్ది హోదా తో ముడిపడి ఉంది కాబట్టి హోదా ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ తో కలిసి ముందుకునడిస్తే ఆశించిన అభివ్రుద్ది అందుకోవచ్చని చంద్రబాబు ఏపి ప్రజానికాన్ని ఒప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఏపి తెలంగాణలో అనేక సందేహాలను నివ్రుత్తి చేయనున్న రాహుల్ గాంధీ పర్యటన..
అయితే ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన వ్యూహాలు పదునుదేలుతున్నాయనేనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును వ్యతిరేకిస్తున్నా ఇవన్నీ ప్రజల్లో గుర్తింపు కోసమేచేస్తున్నారని కూడా వార్తులు వస్తున్నాయి.పైగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రత్యేక హోదా కోసం బంద్ నిర్వహిస్తే దానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబుతో పొత్తుకు ఛాన్స్ లేకపోయినట్లయితే కాంగ్రెస్ నేతలు ఇలా చేసి ఉండేవారు కాదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగితే సమస్యలు ఎదురవుతాయని ఒక అంచనాకు వచ్చిన చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ గాందీ తెలంగాణ పర్యటన తర్వాత చేపట్లబోయే ఏపీ పర్యటనలో మరింత క్లారిటి వచ్చే అవకాశాలు ఉన్నాయి.