జెండా దొంగిలించి, నన్ను బహిష్కరిస్తావా: అన్నా క్షమించంటూ మోత్కుపల్లి కంటతడి, బాబు సీరియస్
Recommended Video
హైదరాబాద్: తనను తెలుగుదేశం పార్టీపై బహిష్కరించడంపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా స్పందించారు. అసలు తనను బహిష్కరించే హక్కు వారికి ఎక్కడిది అని ప్రశ్నించారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను దొంగిలించారన్నారు. అలాంటి వాళ్లకు నన్ను బహిష్కరించే హక్కు ఎక్కడిదన్నారు.
చదవండి: మోత్కుపల్లికి ఝలక్, టీడీపీ నుంచి బహిష్కరణ: గవర్నర్ పదవిపై కొత్త విషయం చెప్పిన ఎల్ రమణ
టీడీపీ జెండా నందమూరి కుటుంబానికి చెందినిది అన్నారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న మోత్కుపల్లిని టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మహానాడు వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి ఆగ్రహించారు. అంతకుముందు, ఉదయం ఆయన తనను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని కంటతడి పెట్టుకున్నారు.
చదవండి: అవసరమైతే జగన్తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్
ఇతర నేతలకు హెచ్చరిక
చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న మోత్కుపల్లిపై బహిష్కరణ వేటు సరైనదేనని నేతలు చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన వ్యాఖ్యలను గమనించిన అనంతరం.. ఇటీవల తెలంగాణ మహానాడుకు ఆహ్వానించలేదు. ఇప్పుడు ఏపీలో మహానాడు సమయంలో మరింత ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వేటు వేశారు. మోత్కుపల్లి వంటి సీనియర్ నేతపై వేటు ద్వారా పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, హద్దు దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని దీని ద్వారా పార్టీ చెప్పదల్చుకున్నదని అంటున్నారు. ఏ స్థాయి నేతలు అయినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
పొత్తు నుంచి విలీనం దాకా.. బాబు సీరియస్
గతంలో మోత్కుపల్లి చేసిన పొత్తు వ్యాఖ్యలు కలకలం రేపాయి. అప్పటి నుంచి అధిష్టానం సీరియస్గానే ఉందని అంటున్నారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందన్నారు. మరోవైపు అప్పటికి టీడీపీలోనే ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నాలు చేశారు. ఇరువురి మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల యుద్ధం నడిచింది. అప్పటి నుంచే మోత్కుపల్లిపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారని అంటున్నారు. ఇటీవల తెరాసలో పార్టీని విలీనం చేయాలని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు
గత కొద్దిరోజులుగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్న మోత్కుపల్లి ఎన్టీఆర్ జయంతి రోజైన సోమవారం మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటుకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ వదిలిపెట్టారని, కేసీఆర్కు అడ్డంగా దొరికిపోయారని, చంద్రబాబు దొరకని దొంగ అని, ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు మాట మార్చాడని, యూజ్ అండ్ త్రో నే అని, ఎన్టీఆర్ నుంచి పార్టీని దొంగిలించారని, ఆయన చావుకు చంద్రబాబే కారణమని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏపీలో చంద్రబాబును ఓడించాలని కూడా పిలుపునిచ్చారు. అవసరమైతే తాను రథయాత్ర చేపడతానన్నారు. దీంతో వెంటనే ఆయనపై వేటు పడింది.
తెలంగాణను చంద్రబాబు పట్టించుకుంటే
తెలంగాణలో చంద్రబాబు లేకుంటే టీడీపీ లేదని, ఆయన తనకు బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, ఆయన జోక్యం చేసుకుంటే పార్టీ కోసం పని చేస్తానని మోత్కుపల్లి నిన్నటి వరకు చెప్పారు. చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సోమవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఇటు తెలంగాణలో, అటు ఏపీలో కార్నర్ చేసేవిధంగా వ్యాఖ్యలు చేశారు.
కంటతడి పెట్టిన మోత్కుపల్లి
చంద్రబాబు తనను నిర్లక్ష్యం చేశారని మోత్కుపల్లి కంటతడి కూడా పెట్టారు. అందరి మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు ఎల్ రమణ ఆయనను బహిష్కరిస్తున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటన చేశారు. మహానాడులో బీజీగా ఉన్నప్పటికీ ఆయన వ్యాఖ్యల తీవ్రత నేపథ్యంలో ప్రకటన చేశారు. మహానాడు తొలి రోజు చంద్రబాబు.. మోత్కుపల్లి అసంతృప్తిపై పరోక్షంగా స్పందించారు. పదవులు దక్కని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అన్నగారు క్షమించండి
ఈ సందర్భంగా మోత్కుపల్లి ఓ ఫ్లెక్సీతో ఆకట్టుకున్నారు. అందులో ఇలా ఉంది. ఆంధ్రరాష్ట్ర ప్రజలారా, చంద్రబాబు ఓ నమ్మకద్రోహి, నమ్మకమండి నమ్మిమోసపోకండి అని ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఉంది. ఆ తర్వాత మోత్కుపల్లి మాట అంటూ.. క్షమించండి అన్నగారు.. తమరు చెప్పినా వినకుండా నమ్మాను, నమ్మిమోసపోయాను అని పేర్కొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు మాట అంటూ.. రాజకీయం అంటే వ్యాపారం, అందుకే రాజ్యసభ సీట్లకు వేలం వేస్తున్నానని, రూ.100 కోట్లకు ఓక సీటు అని పేర్కొన్నారు.