ఏదో ఒక భయంతో వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డికి టీడీపీ సీత షాక్, చంద్రబాబు ఇంకా చెప్పలేదు
మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే సీత గురువారం పరోక్షంగా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీని వీడిన వారందరు పదవులు అనుభవించి ఏదో ఒక భయంతో వెళ్లిపోయారని ఆగ్రహించారు.
ఎన్నికల్లో కేసీఆర్కు చుక్కలు, వంటేరును తుదముట్టించాలని కేసీఆర్: సంచలన ఆరోపణ
కార్యకర్తలు మాత్రం పార్టీని నమ్ముకొని ధైర్యంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కార్యకర్తలకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. గురువారం టీడీపీ మహబూబ్ నగర్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్ర అధికార ప్రతినిధి, పాలమూరు పార్లమెంటరీ ఇంచార్జి దుర్గాప్రసాద్ హాజరయ్యారు.
పదిహేడేళ్లు అధికారంలో ఉండి
ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో సుభిక్ష పాలన అందించిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. పదిహేడేళ్లు అధికారంలో ఉన్నప్పుడు టిడిపి చేసిన అభివృద్ధి ఇంకా పల్లెల్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 18న పల్లెపల్లెకు టిడిపి కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అందరిని కలిసి పలకరించి టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టాలన్నారు.
టిడిపి నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుంది
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని దుర్గాప్రసాద్ అన్నారు. టీఆర్ఎస్ మూడున్నరేళ్లలో చేసింది ఏమీ లేదన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీలో టీడీపీ ప్రభుత్వం రెండుసార్లు డీఎస్సీ వేసిందని, కానీ తెలంగాణ మాత్రం ఏం చేయలేకపోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
టీఆర్ఎస్తో పొత్తు గందరగోళంపై
టీఆర్ఎస్ పార్టీతో టిడిపి వెళ్తుందని కొందరు చెబుతున్నారని, దీంతో కార్యకర్తలు, నాయకులు అయోమయంలో ఉన్నారని కొందరు చెప్పగా, పొత్తులపై ఇప్పటి వరకు అధినేత చంద్రబాబు ఎక్కడా ప్రకటించలేదని, ఆ విషయాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని దుర్గాప్రసాద్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.
కార్యకర్తలు మనోనిబ్బరంతో ఉండాలి
టీడీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లో తీసుకొని వెళ్లేవిధంగా పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమాన్ని మార్చి 29 వరకు చేపడుతున్నట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న గ్రామ, మండల కమిటీలను పూర్తి చేసుకొని, పార్టీ అనుబంధ సంఘాలను వేసుకోవాలన్నారు. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేలా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కె.దయాకర్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు మనోనిబ్బరంతో ఉండాలన్నారు. మనం ఏనాడు తెలంగాణకు వ్యతిరేకం కాదని, కేవలం కేసీఆర్కు వ్యతిరేకమన్నారు.