టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు, నందమూరి సుహాసిని ఆస్తులు ఇవే, భర్త సంపాదన 'నిల్'
హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ 14 స్థానాలలో పోటీ చేస్తోంది. ఆదివారం నాడు టీడీపీ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చింది. కూటమిలో ఆయా పార్టీలకు సీట్లు, అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపుపై రగడ, బుజ్జగింపులకే సమయం సరిపోయింది. ఇప్పటికీ సమస్యలు పూర్తి కాలేదు. కానీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో కూటమి పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్లతో పాటు ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కూడా మిగతా అభ్యర్థులను ప్రకటించాయి.
Recommended Video
ఆదివారం ఆయా పార్టీలు తమ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చాయి. ఖరారు కానీ చోట అభ్యర్థులను పైనలైజ్ చేశాయి. ఇందులో బాగంగా టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారు. టీడీపీ మొదటి బీఫారాన్ని కూకట్పల్లి అభ్యర్థి నందమూరి సుహాసినికి ఇచ్చింది. పార్టీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి దీనిని అందించారు.
టీడీపీ బీఫారాలు అందుకున్నది వీరే
ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి మచ్చా నాగేశ్వర రావు, మహబూబ్నగర్ నుంచి ఎర్ర శేఖర్, మక్తల్ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి భవ్య ఆనంద ప్రసాద్, ఉప్పల్ నుంచి వీరేందర్ గౌడ్, మలక్పేట నుంచి ముజఫర్ అలీ, వరంగల్ వెస్ట్ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేష్ గుప్తా, కూకట్పల్లి నుంచి నందమూరి సుహాసిని, ఇబ్రహీం పట్నం నుంచి సామ రంగారెడ్డి, సనత్ నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేయనున్నారు. బీఫాం అందుకున్న వారితో రావుల ప్రమాణం చేయించారు. సండ్ర తరఫున ఆయన అనుచరుడు, కొత్తకోట తరఫున ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డిలు బీఫారం అందుకున్నారు. సామ రంగారెడ్డి బీఫాం విషయంలో సస్పెన్స్ కొనసాగింది.
కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన సుహాసిని
ఇదిలా ఉండగా, కూకట్పల్లి నుంచి పోటీ చేస్తున్న సుహాసిని తొలిసారి ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. ఆమె ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. టీడీపీ నేతలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.
సుహాసిని ఆస్తులు ఇవే
కూకట్పల్లి అభ్యర్థిగా శనివారం నాడు నామినేషన్ దాఖలు చేసిన సుహాసిని తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు ప్రకటించారు. తనకు నాంపల్లి నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందని పేర్కొన్నారు. 2017-18 సంవత్సరానికి తనకు రూ.10,53,300 వార్షిక ఆదాయం ఉందని, తన కొడుకుకు రూ.12 లక్షల వార్షిక ఆదాయం ఉందని పొందుపరిచారు. సుహాసిని భర్త వెంకట శ్రీకాంత్ వార్షిక ఆదాయం ఏమీ లేనట్లుగా చూపించారు. ఒక హ్యుండాయ్ కారు, 2,222 గ్రాముల బంగారు నగలు, 30 లక్షల విలువైన వజ్రాభరణాలు సహా రూ.1కోటి 52 లక్షల 41 వేల 493 విలువైన చరాస్తులు చూపించారు. రూ.4 కోట్ల 30 లక్షల స్థిరాస్తులు తన పేరున ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
భర్త, కొడుకు పేర ఆస్తులు
తన భర్త శ్రీకాంత్కు రూ.65 లక్షల విలువైన స్థిరాస్తులు, కుమారుడుకు రూ.88 లక్షల 38 వేల విలువైన స్థిరాస్తి, రూ.1 కోటి 2 లక్షల 60 వేల చరాస్తులు ఉన్నట్టు సుహాసిని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. పెట్టుబడులు, షేర్ల విషయానికి వస్తే, మిక్ ఎలక్ట్రిక్ సంస్థలో తన పేరున రూ.4 లక్షల 50 వేల విలువైన పెట్టుబడులు, శ్రీ భవాని కాస్టింగ్ లిమిటెడ్లో తన భర్త పేరుపై రూ.5 లక్షల విలువైన షేర్లు, కొడుకు పేరున రూ.లక్షా 50 వేల విలువైన ఎస్బీఐ పాలసీ ఉన్నట్టు తెలిపారు.
రూ.10 లక్షల ఇన్కం ట్యాక్స్, సామాజిక కార్యకర్త
మొత్తంగా నందమూరి సుహాసిని, కుటుంబం ఆస్తులు రూ.5.82 ఆస్తులు చూపించారు. సుహాసిని వయస్సు 43 ఏళ్లు. ఈమె న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. అద్దెల ద్వారా ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు. తాను సామాజిక కార్యకర్తగా కూడా పేర్కొన్నారు. ఆమె రూ.10 లక్షల ఆదాయపన్ను కడుతున్నట్లు పేర్కొన్నారు. తాను మాసాబ్ట్యాంకులోని హుమాయున్ నగర్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు.