తెలుగుదేశం పార్టీకి దొరికింది ఓ రేవతి..! "మౌనరాగం" ఆలపిస్తుందా..? "గాయం" చేస్తుందా..?
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణలోని అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు తెరలేపుతున్నాయి. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించాలా అని ప్రణాళికలు రచిస్తున్నాయి పార్టీలు. అదే సమయంలో పార్టీలో కాస్త గ్లామర్ ను పొదిగి ఓటర్లను ఆకర్శించేందుకు కూడా వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మొన్న సినీ తారలను పార్టీలోకి ఆహ్వానించి బీజేపి హడావిడి చేస్తే., నేడు టీడిపి కూడా అదే పని చేసింది. రేవతి చౌదరి అనే సినిమా హీరోయిన్ ను పార్టీలో చేర్చుకుని అదనపు ఆకర్శణను తీసుకొచ్చారు అగ్రనేతలు.
టీడిపి కి ఇప్పుడు ప్రజాకర్శణ కావాలి..! అందుకోసం సినీ గ్లామర్ ను వాడాలి..!!
తెలంగాణలో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడిపి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపించాలన్న పట్టుదలతో ఉంది. అందుకే మహాకూటమి పేరుతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీతో సహా మరో మూడు పార్టీలతో కలసి మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. కొద్దిరోజుల్లో సీట్ల సర్ధుబాటు కూడా పూర్తయితే ఇక ఎన్నికల సమరంలోకి దూకేందుకు కాలుదువ్వుతోంది టీడిపి.
బాబు భరోసా ఉండాలి..!దాంతో పాటు కాస్త కిక్కు కూడా కావాలి..!
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించాలని, ఇక్కడ ఆ పార్టీని లేకుండా చేయాలని భావించిన టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు కూడా టీడీపీ నేతలకు భరోసా ఇవ్వడంతో పాటు ప్రచారానికి వస్తానని చెప్పడంతో వారిలో ఉత్సాహం రెట్టింపైంది.
సీట్ల సర్దుబాటు తర్వాత ప్రచారమే..! సభలతో హోరెత్తించనున్న టీడిపి..!!
సీట్ల సర్ధుబాటు పూర్తయిన వెంటనే టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణను ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈయనతో పాటు మరికొందరు సినీ ప్రముఖులను కూడా ప్రచారానికి దింపాలని డిసైడ్ అయ్యారు ఆ పార్టీ నేతలు. అందులో భాగంగానే టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో ఎన్టీఆర్ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
తెలంగాణ మీటింగులకు బాలక్రిష్ణ..!తళుక్కుమననున్న తెలుగు హీరోయిన్లు..!!
ఈ సందర్భంగా అక్కడి నేతలు సినీ నటి రేవతిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం, దానికి ఆమె ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఆమెను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పి రేవతిని పార్టీలోకి ఆహ్వానించారు. రేవతి పార్టీలో చేరిన వెంటనే ఆమెకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఇది నిజం కాదని, ఆమెను ప్రచారం కోసమే ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది.రేవతి ఛరిష్మా ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.