టిడిపికి క్యాడర్ లేదు, కాంగ్రెసుకు లీడర్ లేడు: హరీష్ రావు కామెంట్
మెదక్: నారాయణఖేడ్లో గులాబీ జెండా ఎగురబోతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు నారాయణఖేడ్కు చేసిందేమీలేదని వివరించారు. ఆయన గురువారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్కు లీడర్ లేడని, టీడీపీకి కేడర్ లేదని ఎద్దేవా చేశారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని మూడేళ్లలో నారాయణఖేడ్లో జరిపించి చూపిస్తామని స్పష్టం చేశారు. నారాయణఖేడ్లో కాంగ్రెస్, టీడీపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు.
తొలి నుంచీ కెసిఆర్ టార్గెట్ చంద్రబాబే: టిడిపిలో మిగిలిందెవరు, వెళ్లిందెవరు?
కాంగ్రెస్, టీడీపీల హయాంలో నారాయణఖేడ్కు చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. నిన్న ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రకాష్గౌడ్ టీఆర్ఎస్లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు.
టిడిపికి ఓటు వేస్తే మోరిలో వేసినట్టేనని, కాంగ్రెస్ ఆరిపోయే దీపంలాంటిదని అన్నారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను చిత్తుగా ఓడించిన విషయాన్ని తెలిపారు. హైదరాబాద్లో చెల్లని కాంగ్రెస్ నారాయణఖేడ్లో చెల్లుతుందా? అని అడిగారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారంలో ఉన్నపుడే వాళ్లు నారాయణఖేడ్కు ఏమీ చేయలేకపోయారని తెలిపారు. అందుకే టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించండని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సైకిల్ పార్టీ వాళ్లు ఎవరైనా ఉంటే టీఆర్ఎస్కు ఓటు వేయండని కోరారు. అందరం కలిసికట్టుగా నారాయణఖేడ్ను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.