మేం బలంగానే ఉన్నాం: టిఆర్ఎస్ గెలుపుపై 'లెక్క' చెప్పిన లోకేష్
విజయవాడ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితం కావడం, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు టిఆర్ఎస్లో చేరుతుండటంతో.. తెలంగాణలో టిడిపికి చోటు లేదని తెలుస్తోందని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీనిపై టిడిపి నేత నారా లోకేష్ స్పందించారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉందని, ఇది అలాగే ఉంటుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి ఒక సీటుకు పడిపోవడంపై స్పందిస్తూ.. సెటిలర్లు భయాందోళనకు గురై తెరాసకు ఓటువేశారని, అలాగే కాంగ్రెస్ ఓట్లు పూర్తిగా అధికార పార్టీకి బదలీ అయ్యాయని, అందుకే తాము సీట్లు గెలుచుకోలేకపోయామన్నారు.
అయితే, తమ ఓట్ల శాతం మాత్రం తగ్గలేదన్నారు. తాము సీట్లు కోల్పోయామే తప్ప ఓట్లు కోల్పోలేదని చెప్పారు. 2019 నాటికి తెలంగాణలో టిడిపియే అధికారంలోకి వస్తుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలకు పూర్తి వ్యతిరేకంగా 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉంటాయన్నారు.
కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన తమకు పోయేదేం లేదన్నారు. క్యాడర్ మాత్రం అలాగే ఉందన్నారు. తాము తిరిగి పుంజుకుంటామని చెప్పారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెదిరించి, ప్యాకేజీలతో టిఆర్ఎస్ లొంగదీసుకుంటోందన్నారు. క్యాడర్ మాత్రం ఎక్కడికీ పోలేదన్నారు.
తెలంగాణలో పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ బాగా పడిపోయింది, గతంలో కాంగ్రెస్ పార్టీకి 35 శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఏకంగా పది శాతానికి పడిపోయిందన్నారు. ఆ ఓట్లన్నీ తెరాసకు పడ్డాయన్నారు. ఇది ఆ పార్టీ గెలుపుకు ఉపయోగపడిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ 150 స్థానాల్లో పోటీ చేస్తే 55 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, టిడిపి - బిజెపి ఓటు షేర్ 25 శాతం ఉందని చెప్పారు. గ్రేటర్లో టిడిపి 65 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. వీటిని బట్టే తాము ఎంత బలంగా ఉన్నామో తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.
టిఆర్ఎస్ సీమాంధ్రులలో భయాన్ని సృష్టించిందని, ఆ పార్టీకి ఓటు వేయకుంటే తమను ఇబ్బందులు పెడతారని భావించి వారు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారన్నారు. ఇవన్నీ కలిసి తెరాస గెలిచిందన్నారు. టిఆర్ఎస్ తన హామీలు నెరవేర్చకుంటే ఓటర్ల మైండ్ సెట్ మారుతుందన్నారు. అందరు టిడిపి - బిజెపి వైపు రావడం ఖాయమన్నారు.