రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్ కుట్రలు: రేవంత్ విడుదలపై పెద్దిరెడ్డి, సీతక్క హర్షం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, ఎల్ రమణలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే సిఎం కెసిఆర్ తమ పార్టీ నేతలపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సమస్యలపై పోరాటంలో రాజీ లేదని నేతలు తేల్చి చెప్పారు. ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నామని పెద్దిరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. కోర్టు తమ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిలిచ్చిందని తెలిపారు.
ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరూ బయటపడ్తారని పెద్దిరెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో సిఎం కెసిఆర్.. ఇతర పార్టీల నేతలను ఎలా చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ అక్రమాలపై పోరాటం సాగిస్తామని ఎల్ రమణ చెప్పారు. కార్యకర్తల అండతో ముందుకెళ్తామని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని, గత 29 రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నామని టిటిడిపి నేత సీతక్క అన్నారు. మంగళవారం రేవంత్కు బెయిల్ రావడంతో హర్షం వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర ఫలితంగా రేవంత్ ఈ కేసులో ఇరుక్కున్నారని అన్నారు. కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోలేదా? అని ఆమె ప్రశ్నించారు. టిఆర్ఎస్లో ఉన్న అంతర్గత విబేధాలు బయటకు రాకుండా.. విపక్షాలు, మీడియా గొంతునొక్కారని మండిపడ్డారు. ప్రజల తరఫున కెసిఆర్ ప్రభుతాన్ని విమర్శిస్తున్న రేవంత్ను ఈ విధంగా కేసులో ఇరికించారని సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శించారు.
సిఎం కెసిఆర్ కుట్ర ఫలితంగా రేవంత్ రెడ్డి 29 రోజులుగా జైల్లో ఉన్నారని సీతక్క అన్నారు. ఈ ఘటనను ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్ను ప్రశ్నించినందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రేరేపించి, ట్రాప్లో రేవంత్ను ఇరించినట్లు సీతక్క ఆరోపించారు.
కెసిఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. న్యాయమే గెలిచిందని, రేవంత్కు బెయిల్ వచ్చిందని ఆమె అన్నారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని, రేవంత్ నిర్దోషిగా బయటపడతారని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.