ఖైరతాబాద్ ను కోల్పోయిన టీడిపి..! రమణ వ్యవహారంపై సందేహం వ్యక్తం చేస్తున్న తెలుగుతమ్ముళ్లు..!
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికలు రాజకాయ పార్టీల అసలు రంగును బహిర్గతం చేస్తున్నాయి. చంద్రశేఖర్ రావును నిలువరించేందుకు మహాకూటమిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా ఆదిపత్యానికి పాల్పడుతున్నాయి. పొత్తు ధర్మం పేరుతో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ నియోజక వర్గాలను కూడా తమ ఖాతాలో వేసుకుని కాంగ్రెస్ పార్టీ రంగేంటో బహిర్గతం చేసుకుంటోంది. గ్రేటర్ లో గతంలో మెజారీటి స్థానాలను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఆసీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడుతోంది.అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ గుర్తుమీద గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అదికార టీఆర్ఎస్ లోకి మారిపోయారు.
ఖైరతాబాద్ కాంగ్రెస్ కే..! అయోమయానికి గురైన తెలుగుతమ్ముళ్లు..!!
దీంతో రెండవతరగతి నాయకత్వం అహోరాత్రులు కష్టపడి నియోజకవర్గంలో ప్రజాధరణ పొందగలిగినా ప్రయెజనం లేకుండా తయారయ్యింది. దాదాపు నాలుగేళ్లుగా నియోజెక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలను పరిష్కరించి ప్రజల తలలో నాలుకగా మారినా పొత్తులో భాగంగా సీటు కోల్పోవడం అత్యంత శోచనీయమని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ లో గుండెకాయ లాంటి ఖైరతాబాద్ నియోజక వర్గంలో కాంగ్రెస్, టీడిపి మద్య హైడ్రామా నడిచినట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ , ఖైరతాబాద్ నియోజక వర్గాల్లో ఏదో ఒకటి స్థానం తెలుగుదేశం పార్టీకి వస్తుందని టీడిపి భావించింది.
ఖరతాబాద్ టీడిపికే అనుకున్న టీడిపి ఆశావహులు..! షాక్ ఇచ్చిన కాంగ్రెస్..!!
కాగా దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్టువర్దన్ రెడ్డి కి జూభ్లీహిల్స్ టికెట్ కేటాయిండంతో, ఖైరతా బాద్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వస్తుందని తెలుగుతమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. అందులో భాగంగానే టీడిపి కి చెందిన లంకల దీపక్ రెడ్డి, బీయన్ రెడ్డిలు టికెట్ ను ఆశించి నియోజక వర్గంలో చురుకైన పాత్రపోషిస్తున్నారు. గత ఎన్నికల్లో ఖైరతా బాద్ , జూభ్లీహిల్స్ రెండూ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలోకి వచ్చిన సీట్లే కావడం విశేషం. ఐతే పొత్తులో భాగంగా ఖైరతాబాద్ సీటును బీజెపికి కేటాయించిన టీడిపి, చింతల రాంచంద్రారెడ్డిని గెలుపించుకుంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ఖైరతాబాద్ సీటును కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుని తెలుగుతమ్ముళ్లను విస్మయానికి గురిచేసింది.
ఖైరతాబాద్ అంశంలో అంటీముట్టనట్టు వ్యవహరించిన రమణ..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆశావహులు..!!
ఖైరతా బాద్ నియోజక వర్గం పైన తెలుగుదేశం తెలంగాణ ముఖ్య నేతల మద్య అనేక తర్జన బర్జనలు జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజక వర్గం కాంగ్రెస్ కేటాయిస్తున్నప్పుడు, ఖైరతాబాద్ నియోజక వర్గాన్ని తెలుగుదేశానికి కేటాయించాలని స్వయంగా చంద్రబాబే కాంగ్రెస్ అదిష్టానానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకూడా ఖైరతాబాద్ నియోజక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఐతే ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ తెలంగాణ అద్యక్షుడు యల్ రమణకు ఏమాత్రం ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది.
రమణ వ్యవహారంపై విమర్శలు..! చంద్రబాబుకు ఫిర్యాదు..!!
ఖైరతాబాద్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేనట్టుగా ఆయన వ్యవహరించినట్టు సమాచారం. చంద్రబాబుకు ఇచ్చిన ప్రాదమిక నివేదికలో కూడా ఇదే అంశాన్ని పేర్కొనండంతో బాబు రమణ మీద సీరియస్ ఐనట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ తీసుకున్నప్పుడు ఖైరతాబాద్ టీడిపి కోరుకోవడంలో తప్పేంటి అని రమణను బాబు మందలించినట్టు సమాచారం. ఐతే స్థానిక రాజకీయాలను అడ్డం పెట్టుకుని రమణ చివరివరకు ఊడిసలాటదోరణి అవలంభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లి పోవడానికి వందకు వందశాతం రమణ చొరవ ఉన్నట్టు పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఖైరతాబాద్ నియోజక వర్గంగురించి కాంగ్రెస్ అదిష్టనంతో చర్చలు జరపాలని ఖైరతాబాద్ టిడిపి టికెట్ ఆశావహులు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.