కెసిఆర్తో మాగంటి, గాంధీ భేటీ: ప్రాణహానీ ఉందన్నా పట్టించుకోలేదు: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో గురువారం నాడు భేటీ అయ్యారు. వీరు సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. మాగంటి, గాంధీలు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
తమను అధికార పార్టీ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ మధుసుదనా చారికి వారు లేఖ కూడా రాశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మాగంటి, గాంధీలను టిడిపి నాయకత్వం సస్పెండ్ చేసంది కూడా. టిడిపిలో ఇక మిగిలింది రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్యలే.
ప్రాణహానీ ఉందన్నా స్పందించలేదు: రేవంత్ రెడ్డి
తనకు ప్రాణహానీ ఉందని దళిత యువకుడు తలారి సత్యం... ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషఖన్, పోలీసులను వేడుకున్నాడని, అయినా ఎవరూ స్పందించకపోవడంతో సత్యం ప్రాణాలు కోల్పోయాడని టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఎన్నిక అఫిడవిట్లో దుబాయ్లో ఆయన పైన ఉన్న కేసులకు సంబందించి వివరాలు పొందుపరచలేదన్నారు. ఈ విషయమై ఆర్పీఐ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తలారి సత్యం ఎన్నికల అధికారికి ఫఇర్యాదు చేశారన్నారు.
పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, తన పైనే ఫిర్యాదు చేస్తారనే కక్షతో ఎమ్మెల్యే వివిధ కేసుల్లో సత్యాన్ని ఇరికించడంతో పాటు ఆయన భార్యతో సత్యంపై కేసులు పెట్టించారన్నారు. పథకం ప్రకారమే ఎమ్మెల్యే సోదరుడి టిప్పర్తో ఢీకొట్టి సత్యంను హత్య చేశారని ఆరోపించారు.