దీపక్ రెడ్డి వల్ల అక్కడ కేసీఆర్ పథకానికే బ్రేక్?: వాటి విలువ రూ.15వేలకోట్లు..
హైదరాబాదులో భూములను సొంతం చేసుకునేందుకు టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, లాయర్ శైలేష్ సక్సేనా చేసిన అక్రమాలపై హైదరాబాద్ సెంట్రల్క్రైమ్ పోలీస్ అధికారులు సాక్ష్యాధారాలను సేకరించారు.
హైదరాబాద్: హైదరాబాదులో భూములను సొంతం చేసుకునేందుకు టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, లాయర్ శైలేష్ సక్సేనా చేసిన అక్రమాలపై హైదరాబాద్ సెంట్రల్క్రైమ్ పోలీస్ అధికారులు సాక్ష్యాధారాలను సేకరించారు.
పదేళ్ల నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తూ హక్కుదారులను బెదిరిస్తున్నారని బాధితుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. శైలేష్ సక్సేనా అనుచరుడు ఆర్ శ్రీనివాసరావు, దీపక్ రెడ్డి డ్రైవర్ తిరుపతి రెడ్డిలు వివాదాస్పద భూములను గుర్తించి సక్సేనాకు సమాచారమిస్తే ఆయన తప్పుడు పత్రాలు సృష్టించడం.. ఇందుకోసం లేని మనుషులను తెరపైకి తీసుకురావడం వంటివి చేస్తున్నారు.
ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైద్రాబాద్లో అరెస్ట్, 'కుట్రచేశారు'
ఆ తర్వాత కోర్టులను ఆశ్రయించి ఈ భూములు తమవేనంటూ అధికారికంగా ఉత్తర్వులు సంపాదించుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ బృందంపై సీసీఎస్లో పలు కేసులు ఉన్నట్లు అదనపు డీసీపీ జోగయ్య తెలిపారు.
డబుల్ బెడ్ రూంల కోసం చూసిన భూమినే..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్ రూం నిర్మాణాల కోసం అనువైన సర్కార్ భూములను అన్వేషించారు అధికారులు. ఆ భూములు కూడా తమవే అన్నట్లుగా దీపక్ రెడ్డి అండ్ కో పత్రాలు సృష్టించింది. గుడిమల్కాపూర్ సమీపంలో ఉన్న భోజగుట్టలోని పోరంబోకు భూములను అధికారులు గుర్తించారు. ఆ స్థలాన్ని చదనుచేసి పేదలకు నివాసం ఏర్పాటుచేయాలనే ఆలోచనతో అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీంతో ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు కొందరు నకిలీ డాక్యుమెంట్స్తో కోర్టు వివాదాలకు తెరలేపినట్టు గుర్తించారు. ఆసిఫ్ నగర్లో శైలేంద్ర సక్సేనా, దీపక్ రెడ్ది గ్యాంగ్ భూకబ్జా వ్యవహారం పేదవారికి గూడు దూరం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ అధికారులను కూడా ముప్పు తిప్పలు పెట్టారు. గుడిమల్కాపూర్లో 45 ఎకరాలకు పైగా మిగులు భూమి ఉంది. దీనిపై లాయర్ శేలేంద్ర సక్సేనా కన్ను పడింది. కొంత మందితో కలిసి ఆ భూమిని కబ్జా చేయడానికి యత్నించారు. తప్పుడు డాక్యుమెంట్లతో కొన్ని ఎకరాలను ఇతరులకు విక్రయించి రూ.కోట్లు దండుకున్నారు.
అడ్డుపడ్డారు
అదే భూమిలో ప్రభుత్వం పేదవారికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం 13 ఎకరాల భూమిని కేటాయించింది. పొజిషన్కు రెవెన్యూ అధికారులు వెళ్లగా శైలేంద్ర సక్సేనా అండ్ కో అడ్డుపడింది. ఆ భూమి తమదేనని వాదించింది. దీనిపై రెవెన్యూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమిపై శైలేంద్ర సక్సేనా అండ్ కో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్టేట్స్ కో కూడా తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వివాదం కోర్టులో ఉండగానే ఇతర భూములను కూడా దర్జాగా విక్రయించారు. ఈ వ్యవహారమంతటికీ దీపక్ రెడ్డిని కీలకసూత్రధారిగా పోలీసులు తేల్చారు. బుల్ బెడ్ రూం ఇళ్లు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
బేధాభిప్రాయాలతో వెలుగులోకి..
కొన్ని సెటిల్మెంట్లకు సంబంధించి శైలేంద్ర సక్సేనా అండ్ కోలో భేదాభిప్రాయాలు వచ్చాయి. అతడి స్నేహితుడు శ్రీనివాస్.. శైలేంద్ర సక్సేనా సృష్టిస్తున్న తప్పుడు డాక్యుమెంట్లు, భూ కబ్జాల గురించి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరిగారు. అతడు చేస్తున్న మోసాలపై ఆరు పేజీలతో నోట్ తయారు చేసి అధికారులకు సమర్పించాడు.
బెదిరించి లాక్కున్నారు
అంతేకాదు ఆ కాపీలను కలెక్టర్, డీజీపీ, సీఎం ఆఫీసులకు కూడా పంపినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీపక్ రెడ్డి, శైలేంద్ర సక్సేనా అండ్ గ్యాంగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. 45 ఎకరాల భూమితో పాటు వాటి పక్కన ఉన్న పట్టా భూమిదారులను కూడా బెదిరించి ఆ భూములు కూడా తమవేనని డాక్యుమెంట్లు సృష్టించినట్టుగా చెబుతున్నారు. బంజారాహిల్స్లో కూడా 3.39 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు శైలేంద్ర సక్సేనా అండ్ గ్యాంగ్ ప్రయత్నించింది. మొత్తం 76 ఎకరాను ఆక్రమించడానికి ప్రయత్నించారు.
రూ.15వేల కోట్ల భూకబ్జా
ఇదిలా ఉండగా, దీపక్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తులను దాదాపు రూ.7,000 కోట్లుగా చూపించారు. అంతేకాదు, 2012 అఫిడవిట్లో ఏడాదిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు చూపించారు. కాగా, దీపక్ రెడ్డి భూకబ్జా చేసిన ఆస్తులు రూ.15వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.