ఏం చేస్తానో చూస్తారు: సుధారాణి తడబాటు, బాబు ఓకే, కెసిఆర్కు ప్రశంస
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి బుధవారం నాడు ట్విస్ట్ ఇచ్చారు. తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతానా లేదా అనే విషయమై రాష్ట్ర ప్రజలే చూస్తారని చెప్పారు. తద్వారా ఆమె నేడో, రేపో కారు ఎక్కుతారని తెలుస్తోంది.
ఆమె ఢిల్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి విషయంలోనే తాను ముఖ్యమంత్రిని కలిశానని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అన్నారు.
తాను వరంగల్ ఉప ఎన్నిక, రాజ్యసభ గడువు ముగుస్తున్నందున టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాననే వార్తలను ఆమె కొట్టిపారేశారు. పదవులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమన్నారు. తాను చేరే విషయమై ప్రజలే చూస్తారని ట్విస్ట్ ఇచ్చారు.
వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడం సంతోషకరమని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. జలహారం, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు.
తడబడిన సుధారాణి
విలేకరులు ప్రశ్నించే సమయంలో గుండు సుధారాణి తడబడ్డారు. కెసిఆర్ను పొగుడుతూ.. తాను అందులో చేరబోతున్నట్లు చెప్పబోయి ఆపేశారు. ఆమె తడబడటం ఓ టీవీ ఛానల్ చూపించింది. కాగా, చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.
రాష్ట్రపతి ప్రణబ్తో సీఎం కేసీఆర్ భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అంతకుముందు భేటీ అయ్యారు. డిసెంబర్ నెలలో నిర్వహించే చండీయాగానికి రావాల్సిందిగా సీఎం రాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతకుముందు కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటి అయ్యారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలు చేయాల్సిందిగా కోరారు.