చంద్రబాబుపై మల్లన్న భజన వెనుక మర్మం: సుజనా స్థానం కోసమేనా?
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్లోని ట్రస్ట్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టిన రోడు వేడుకలకు తెలంగాణ టీడీపీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరైన టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని కాబోయే ప్రధాన మంత్రిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కార్యకర్తగా పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని బాబు నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వనవాసం చేస్తోందని, 2019 ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. అయితే ఎంపీ మల్లారెడ్డి ఇలా టీడీపీపై ప్రేమను బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు చాలా తక్కువ. ఇలా పార్టీ, అధినేతపై వల్లమాలిన ప్రేమ కురిపించడానికి ఏదో కారణం ఉందని అనుమానిస్తున్నారు.
టీడీపీకి తెలంగాణలో ఉన్న ఏకైక ఎంపీ మల్లారెడ్డి. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా? లేదా అనే అనుమానులు కూడా ఉన్నాయి. మల్లారెడ్డికి తెలుగుదేశం పార్టీతో మొదటి నుంచి అంత అనుబంధాలు లేవు. 2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు.
అంతేకాదు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డికి అయన స్వయానా వియ్యంకుడు. దీనికి తోడు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ సీఎం కెసిఆర్ను పొగడ్తలతో ముంచెత్తుతుంటాడు. అయితే తాజాగా మల్లారెడ్డి ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా టీడీపీపై వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం మరేదో ఉందని అంటున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ మిత్రపక్షంగా ఉంది. ఇందులో భాగంగా ఎన్టీఏ ప్రభుత్వం టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరిపై ఇటీవల కాలంలో పలు ఆరోపణలను వచ్చాయి. అంతేకాదు నాంపల్లి కోర్టు ఏకంగా ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది.
ఈ క్రమంలో సుజనా తీరుపై ప్రధాని మోడీ మండిపడుతున్నట్లు సమాచారం. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపత్యంలో సుజనాను తొలగించే సంకేతాలు అందినట్లు వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీంతో కేంద్ర మంత్రి పదవిపై కన్నేసిన మల్లారెడ్డి అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఏపీ నుంచి అశోక్ గజపతి రాజు ఉండనే ఉన్నాడు కాబట్టి, తెలంగాణ కోటాలో టీడీపీకి వచ్చే ఆ మంత్రి పదవి తనకే ఇవ్వాలని గతంలో అధినేత చంద్రబాబుతో ఎర్రబెల్లి దాయకరరావు ద్వారా చంద్రబాబు కు అయన సిఫారసు కూడా చేయించుకున్నారు. మరోవైపు మల్లారెడ్డితో పాటు వరంగల్కు చెందిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.
కేంద్ర మంత్రి వర్గం నుంచి సుజనా చౌదరిని తొలగిస్తే, ఆ మంత్రి పదవి వీరిద్దరిలో ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.