జగన్కు చంద్రబాబు విరుగుడు: అమరావతి రైతుల ఆందోళన
గుంటూరు: అమరావతి భూదందాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక వరుస వార్తాకథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులను కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం తుళ్లూరు మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు.
జగన్ పత్రిక, ఛానల్లో వస్తున్న కథనాలు.. అసత్యాలేనని, రాజధానిని అడ్డుకోవడం కోసం అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రైతులకు నష్టం కలిగేలా కథనాలను వండివార్చుతున్నారని అన్నారు. రాజధాని భూములు కారు చౌకగా కొట్టేయడానికి ఇక్కడి రైతులు పిచ్చివారు కాదని తెలిపారు.
వాస్తవాలకు దూరంగా జగన్ మీడియా వ్యవహరిస్తోందని సభకు హాజరైన తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. భూదందాకు తెరతీసింది వైఎస్ ఆయన కుమారుడైన జగనేనని దుయ్యబట్టారు. పత్రికా కార్యాలయాలు పెట్టుకోడానికి ఊరికే భూములు కొట్టాయలేదా? అని ప్రశ్నించారు.
క్రిమినల్ ఆలోచనలు ఉండబట్టే ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని శ్రావణ్ విమర్శించారు. రాజధాని ప్రకటించగానే మీరు, మీనేతలు రాజధానిని అడ్డుకోడానికి వెదురు బొంగులు తగలబెట్టలేదా? అని ప్రశ్నించారు.
'మీ బామ్మర్ది(బ్రదర్ అనిల్)కి వేలాది ఎకరాల బయ్యారం గనులు కట్టబెట్ట లేదా? రాజధానిని అడ్డుకోడానికి నేషనల్గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయించలేదా? దొనకొండలో భూములు కొని అక్కడ హత్యలు చేయించలేదా? చివరకు పత్రికను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నావు' అని జగన్పై విరుచుకుపడ్డారు.
జగన్ పత్రిక ప్రస్తుతం అసాక్షిగా మారిందని, విలు వలకు పాతరేస్తోందని మాజీ మంత్రి గల్లా అరుణ అన్నారు. గతంలో జగన్ మీడియా అంటే ఎంతో ఇష్టపడేవారిమని, తర్వాత కాలంలో జగన్ మీడియా విలువలకు పాతరేసి.. రాజకీయ ప్రయోజనాలకు తెగబడుతుండడంతో చిరాకు పుట్టిందని ఆమె అన్నారు. అమర్రాజ గ్రూపు చిత్తూరులో 20 ఎకరాల కోసం రూ.40 కోట్లను సీఎంకి నజరానా కింద ఇచ్చినట్లు పిచ్చిరాతలు రాశారన్నారు.
రాజధాని ప్రాంత రైతుల జీవితాలతో ఆటలాడుకునే నరకాసురులకు తగిన బుద్ధి చెబుతామని హరిశ్చంద్రపురం రైతులు అన్నారు. 'రాజధాని నరకాసురుడు' పేరుతో తయారు చేసిన దిష్టిబొమ్మను తీసుకుని మందడంలో ఏర్పాటు చేసిన రైతుల సభకు ఊరేగింపుగా వచ్చారు. రాజధాని రైతుల జీవితాలతో ఆటలాడుకునే నరకాసురులకు తగిన బుద్ధి చెప్పాలంటూ రాసున్న ప్లకార్డులు ప్రదర్శించారు. టపాసులు కాల్చుతూ దిష్టిబొమ్మను ఊరేగించారు. అనంతరం దానిని దహనం చేశారు.
రైతులు సమాఖ్యగా ఏర్పడి జగన్కు, ఆయన పత్రిక సాక్షికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారని, సాక్షి వరుస కథనాలకు రైతులు భయపడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు శాసనసభలో కూడా ప్రస్తావించారు.