'తెరాస నేతలకు వణుకు, రేవంత్ రెడ్డిని మళ్లీ జైలుకు పంపిస్తారా?'
హైదరాబాద్: రైతులకు న్యాయం చేయాలని అడుగుతున్న తమ పార్టీ యువనేత రేవంత్ రెడ్డిని జైలుకు పంపడం ఖాయమని అధికార తెరాస పార్టీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇది సరికాదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమారి శుక్రవారం విమర్శించారు.
తెరాస నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గాదరి కిషోర్లు భూదందాలో, నకిలీ నోట్లు, ఇసుక దందాలో ఆరితేరారని ఆరోపించారు. టిడిపి చేపట్టిన రైతు పోరు బాటకు మంచి స్పందన వచ్చిందని ఆమె చెప్పారు. తెరాసకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. రేవంత్ జైలుపాలవడం ఖాయమని బెదిరిస్తున్నారన్నారు.
రేవంత్ పైన తెరాస నిప్పులు
కాగా, పల్లా రాజేశ్వర రెడ్డి, గాదరి కిషోర్లు గురువారం నాడు రేవంత్ రెడ్డి పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు మహబూబ్నగర్ జిల్లా కోస్గి సభలో తెరాస ప్రభుత్వంపై తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని పల్లా, గాదరి కిషోర్లు గురువారం చెప్పారు.
రేవంత్ పైన ఆగ్రహం
ప్రభుత్వాన్ని మిషన భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో కమిషన అడిగామా అన్న రేవంత్ వ్యాఖ్యలకు వారు స్పందిస్తూ.. కమిషన్లు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరాస ప్రభుత్వ హయాంలో తావులేదన్నారు. గతంలో నెలపాటు జైళ్లో ఉన్న రేవంత్ రెడ్డికి అది ప్రొబేషనరీ పిరియడ్ కాబోతోందని, ప్రభుత్వంపై ఆధార రహిత విమర్శలు ఆపకపోతే ఆయనను శాశ్వతంగా జైళ్లో పెట్టిస్తామని హెచ్చరించారు.
రేవంత్ను ఎదుర్కోబోతున్నాం
మిషన్ భగీరథ పథకాన్ని దేశమంతా స్వాగతిస్తోందని, సాక్షాత్తూ ప్రధాని మోడీ, నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు. టిడిపి పదిహేడేళ్ల పాలన, కాంగ్రెస్ 43 ఏళ్ల పాలనలో పూర్తికాని పాలమూరు ప్రాజెక్టులను తెరాస తన రెండున్నరేళ్ల హయాంలో పూర్తి చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డిని చట్టపరంగా, రాజకీయంగా ఎదుర్కోబుతున్నామని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ వ్యతిరేక శక్తుల కౌగిలిలో కోదండ
జేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణ వ్యతిరేకశక్తుల కౌగిలిలో చిక్కుకున్నారని పల్లా, గాదరి కిషోర్లు గురువారం మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు పెట్టి, ఎవరూ పిలిచినా వెళుతున్నారని, ప్రాజెక్టులు కట్టాలంటే భూసేకరణ జరగాల్సిందేనన్నారు.
నయీం ఎన్కౌంటర్ తర్వాతే..
నయీం ఎనకౌంటర్ జరిగాకే కోదండరాం, సీపీఐ నారాయణ మాట్లాడుతున్నారని, నయీం బతికున్నప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. రూ.790కోట్ల ఇనపుట్ సబ్సీడీని రైతుల ఖాతాల్లో వేశామని, త్వరలో అవి జమ అవుతాయని ఆయన తెలిపారు.