టీడీపీ-వైసీపీలకు షాక్: 'అవిశ్వాసం అంటే పిల్లలాట కాదు, పట్టించుకోం'
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం మేరకే తాము పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మంగళవారం చెప్పారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.
లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీయే ఈ నాటకం ఆడిస్తోందని వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. తమ పార్టీని ఆడించే సత్తా ఎవరికీ లేదన్నారు. అవిశ్వాస తీర్మానం అంటే పిల్లలాట కాదన్నారు.
టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిపాదిస్తున్న అవిశ్వాసం రాజకీయ అజెండాగా కనిపిస్తోందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తమకు కావాల్సింది రాజకీయ అజెండా కాదని, ప్రజల అజెండా ముఖ్యమని చెప్పారు.
అసలు మాతో చర్చించకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేం ఎందుకు మద్దతిస్తామని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ ఎవరికీ సామంత రాష్ట్రం కాదని, స్వతంత్ర రాష్ట్రమని చెప్పారు. పక్క రాష్ట్రం పార్టీలను తాము పట్టించుకోమన్నారు.
ఇదిలా ఉండగా, పార్లమెంటులో టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యుల ఆందోళన వెనుక బీజేపీ ఉందని తెలుగుదేశం అనుమానిస్తోంది. అవిశ్వాసంపై చర్చ రాకుండా ఉండేందుకు కేంద్రం వారితో ఆందోళనలు చేయిస్తోందని అనుమానిస్తున్నారు.