'ఓ ఉదాహరణ, కెసిఆర్ను నమ్ముకొని సోమేష్ కుమార్ బలిపశువు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పైన, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం నాడు మండిపడ్డారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు దాదాపు 30 లక్షల ఓట్లను గల్లంతు చేశారన్నారు.
తనను నమ్ముకొని పని చేసిన సోమేష్ కుమార్ను బలి పశువును చేశారని విమర్శించారు. కెసిఆర్ను నమ్ముకొని పని చేసే అధికారులకు సోమేష్ కుమార్ ఉదంతం ఓ ఉదాహరణ, హెచ్చరిక అన్నారు. అసెంబ్లీలో సమాధానం చెప్పలేక సభ్యులను సస్పెండ్ చేసిన ఘనత కెసిఆర్దే అన్నారు. టిఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు.
ఎన్నికలు అంటేనే కెసిఆర్ భయపడుతున్నారని మరో నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. కెసిఆర్ దురుద్దేశ్యం, అహంకారంతో తీసుకున్న నిర్ణయంతోనే వరంగల్ ఉప ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు. వరంగల్లో టిడిపి - బిజెపి అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు.
రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన సనత్ నగర్ ఉప ఎన్నికలు రావడం లేదన్నారు. ఎన్నికలు అంటే కెసిఆర్కు వణుకు అన్నారు. కెసిఆర్ మాటలు ఎల్లలు దాటుతున్నాయని, కాళ్లు మాత్రం ఫాంహౌస్ దాటడం లేదని ఎద్దేవా చేశారు. 1100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకు టిఆర్ఎస్కు ఓటేయాలా అని ప్రశ్నించారు.
కార్మికుల పట్ల కెసిఆర్ చిన్నచూపు చూస్తున్నారని, అందుకే వాళ్ల పైన నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆశా వర్కర్లను ఆదుకునేందుకు ప్రజల నుంచి రూ.17.66 లక్షల విరాళాలు సేకరించామన్నారు.
పదిహేడు నెలల పాలనలో కార్మికులను కెసిఆర్ అణిచివేశారన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో కార్మికుల నోట్లో మట్టి కొట్టారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పిఎఫ్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు.