సుధారాణికి ఝలక్, సస్పెండ్ చేసిన టిడిపి: ఆంధ్రా ఓట్లు పోతే మంచిదే: విష్ణు
వరంగల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి ముందే రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణికి తెలుగుదేశం పార్టీ ఝలక్ ఇచ్చింది. ఆమె పైన టిడిపి అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి టిడిపి సస్పెండ్ చేసింది.
గుండు సుధారాణి కారు ఎక్కుతారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఆమె బుధవారం నాడు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఈ సందర్భంగా ఆమె టిఆర్ఎస్లో చేరేందుకు కెసిఆర్ నుంచి హామీ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టిడిపి చర్యలు తీసుకుంది.
వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. గుండు సుధారాణిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు.
గ్రేటర్ కాంగ్రెస్ నేతలపై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం
గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ నేతలు ఒకరి పైన మరొకరు ఫిర్యాదు చేసుకోవడం, ఓట్ల తొలగింపుపై భిన్నంగా మాట్లాడటంతో ఆయన ఆగ్రహించారని సమాచారం.
ఓట్ల తొలగింపు విషయంలో దానం నాగేందర్ సరిగా స్పందించలేదని డిగ్గీకి పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో, తాను యాక్టివ్గానే ఉన్నానని దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. దీనిపై పిసిసితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని డిగ్గీ చెప్పారు.
డిసిసిని రంగారెడ్డి జిల్లాకే పరిమితం చేయాలని కొందరు రంగారెడ్డి జిల్లా నేతలు డిగ్గీకి సూచించారు. రంగారెడ్డి జిల్లా డిసిసిని గ్రేటర్ పరిధిలోని 50 డివిజన్లకు పరిమితం చేయాలన్నారు. అయితే, 150 డివిజన్లను గ్రేటర్ పరిదిలోనే ఉంచాలని దానం నాగేందర్ చెప్పారు.
ఆంధ్రుల ఓట్లు పోతే మంచిదే: విష్ణు
హైదరాబాదులో ఓట్ల తొలగింపు పైన కూడా భిన్న వాదనలు వినిపించారు. ఓట్ల తొలగింపు సరికాదని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. అయితే, విష్ణు మాత్రం మరోవిధంగా స్పందించారు. ఆంధ్రుల ఓట్లు పోతే మంచిదేనని, అప్పుడు మనమే గెలవవచ్చునని చెప్పారు.