కల్లు తాగిన కోతిలా, వైఎస్ తరహాలో కెసిఆర్: టిడిపి నేత రమణ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎసిబికి పట్టుబడిన తమ పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి కేసులో ఫిర్యాదుదారు, విచారణాధికారి, న్యాయమూర్తి, ప్రచారకర్త అన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావే అయ్యారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు.
గంటలో బ్రేకింగ్ న్యూస్ వింటారని కేసీఆర్ చెప్పడం, బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును కాపాడలేరని కేసీఆర్ అనడం చాలా దారుణమని రమణ దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాడని ఎల్ రమణ ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా వైఎస్ అడుగుజాడల్లోనే కేసీఆర్ వెళుతున్నారన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు, కవితల కాల్డేటా బయటపెడితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తెలంగాణా సస్యశ్యమలం కావాలన్నదే టీడీపీ విధానమని రమణ వివరించారు. నీటి పారుదుల ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్ వైయస్ రాజశేఖర రెడ్డి తరహాలో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
కెసిఆర్ తీరు ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లుగా లేదని రమణ అన్నారు. కెసిఆర్ కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.