మరో వికెట్ డౌన్: తెరాసలో చేరిన టిడిపి ఎంపీ మల్లారెడ్డి
హైదరాబాద్: ఊహించినట్లుగా తెలంగాణలో గెలిచి ఏకైక తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు చామకూర మల్లారెడ్డి కారెక్కబోతున్నారు. ఆయన మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి లోకసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన బుధవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరుతున్నారు..
ఆయన బుధవారం ఉదయం 11 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి సిఎఁ క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్ను కలుస్తారు. 2014 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాగిజిగిరి పార్లమెంటు స్థానంతో పాటు ఎల్బీ నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సనత్నగర్ అసెంబ్లీ స్థానాల్లో టిడిపి గెలిచింది.
టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తప్ప మిగతావారంతా టిఆర్ఎస్ గూటికి చేరారు. ఈ స్థితిలో పార్టీకి పెద్ద దిక్కుగా మారిన పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్దపడ్డారు. దీంతో తెలంగాణలో టిడిపి ఉనికి నామమాత్రం కానుంది.
సొంత రాష్ట్రంలో సొంత ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే టిఅర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మల్లారెడ్డి చెప్పారు. బుధవారం ముఖ్యమంత్రిని కలుస్తానని,త ప్రజల అభీష్టం మేరకు పనిచేయడానికే టిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఏకైక పార్లమెంటు సభ్యుడు చామకూర మల్లారెడ్డి గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరబోతున్నారు.
కారు ఎక్కిన మల్లారెడ్డి
ఎంపీ మల్లారెడ్డి బుధవారం తెరాసలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన కారు ఎక్కారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను అభివృద్ధి కోసమే తెరాసలో చేరినట్లు చెప్పారు. తాను తెరాసను లేదా, కేసీఆర్ ను ఎప్పుడు విమర్శించలేదని చెప్పారు.
తెరాస ప్రభుత్వ పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని ఆయన చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి పథకాలతో తెరాస మంచి పాలన అందిస్తోందన్నారు. బంగారు తెలంగాణలో తాను కూడా భాగస్వామిని అవుతానని చెప్పారు.