గెలుపోటములు సహజం .. టీడీపీకి ఇవేమీ కొత్త కాదు : ఫలితాలపై టీడీపీ తెలంగాణా అధ్యక్షుడు ఎల్. రమణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి ఘోర ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేసిన చోట డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ , గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఈ ఎన్నికలలో పూర్తిగా చతికిలబడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడాన్ని చాలా మంది అవహేళన చేస్తున్నారు.
చంద్రబాబు పెట్టిన భిక్షతో ఎదిగి ఫేక్ సీఎం కోసం గాలి మాటలా ..కొడాలి నానీ పై దేవినేని ఉమా ఫైర్
గ్రేటర్ వాసులు టీడీపీని ఆదరించలేదని రమణ ఆవేదన
కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది అని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడంతో పాటుగా ఫలితాలపై మాట్లాడారు టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్లు టీడీపీని ఆదరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రమణ ముప్పై సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు కూడా టిక్కెట్లు ఇచ్చామని పేర్కొన్నారు .పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్ళినా ప్రజల నుంచి ఆదరణ కరువైంది అన్నారు.
కేంద్రం ఏదో చేస్తుందన్న ఆశతో బీజేపీకి ఓట్లేశారు
కేంద్రం ఏదో చేస్తుందని ఆశతో చాలామంది బిజెపికి ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు రమణ. ఇక టీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఒక చురకగా భావించాలని పేర్కొన్న రమణ టిడిపి డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోవడానికి గల కారణాలను సమీక్షించుకుంటామని స్పష్టం చేశారు.
గెలుపోటములు సహజమని అవి టీడీపీకి కొత్త కాదని పేర్కొన్నారు ఎల్.రమణ. జీహెచ్ఎంసీలో టిఆర్ఎస్ సీట్లు సగానికి సగం పడిపోయాయని పేర్కొన్న రమణ టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు.
ఆ పార్టీలు అంగబలం , అర్ధబలంతో వెళ్ళాయి .. టీడీపీ నిజాయితీగా పోటీ చేసింది
కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలు అంగబలం, అర్థబలం తో ఎన్నికలకు వెళ్లాయని రమణ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో నిజాయితీగా పోటీ చేసిందని పేర్కొన్న రమణ, ఇతర పార్టీలలాగా లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత త్వరలో జరగనున్నమేయర్ ఎన్నికలో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకున్న వారెవరో తేలిపోతుంది అంటూ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ఉద్దేశించి ఎల్ రమణ వ్యాఖ్యానించారు.