రివర్స్: 'టిడిపిలో దొంగలు.. టిఆర్ఎస్లో మంత్రులు!', తలసాని పాత అలవాట్లు వద్దు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ అయితే, తమ పార్టీలో పని చేసిన నేతలను మంత్రులుగా ఎలా తీసుకున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి గురువారం నాడు అధికార టిఆర్ఎస్ పార్టీని నిలదీశారు.
టిడిపి నుంచి వెళ్లిన కెసిఆర్ అండ్ కో అందరూ దొంగలేనా అని ప్రశ్నించారు. అమ్ముకోవడం, కొనడం, ఆక్రమించుకోవడం లాంటి పాత అలవాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్చుకోవాలని హితవు పలికారు.
ఆస్తుల ప్రకటనలో తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు. చంద్రబాబుపై విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సమస్యల పైన సమాధానం చెప్పలేకే ప్రభుత్వం సభను వాయిదా వేస్తోందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు.
రుణమాఫీపై కడియం శ్రీహరి షాక్
రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం మాట్లాడారు. నిధుల సేకరణ తర్వాత రుణమాఫీపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది డిఎస్సీపై అధికారులతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.
విపక్షాలకు చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం చర్చకు వస్తే విపక్షాలు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలపై విపక్షాలకు చిత్తశుద్ధి లేదన్నారు. రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో రైతులకు భరోసా ఇస్తున్నారన్నారు.
బతుకునిచ్చిన అమ్మ: ఎంపీ కవిత
బతుకమ్మ అంటే బతుకునిచ్చిన అమ్మ అని టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భవన్లో బతుకమ్మ గోడపత్రిక, పాటల సీడీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ సమాజానికైనా సంస్కృతే మూలాధారం అన్నారు. బతుకమ్మను ప్రతి ఒక్కరూ ఆడాలన్నారు.
ఎంతమంది అవహేళన చేసినా ఎనిమిదేళ్ల నుంచి బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ వచ్చామన్నారు. జాగృతి ఆధ్వర్యంలో తొమ్మిదోసారి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 11 నుంచి 22 వరకు జరగబోయే బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.
మహిళలు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లేది ఉండదని, ఇక ఇప్పుడు విశ్వవ్యాప్తంగా జాగృతి విస్తరించిందన్నారు. ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆడడానికి డబ్బులు లేని పరిస్థితి అని, అటువంటి సమయంలో తమ సంస్కృతిని కాపాడేందుకు నగలు తాకట్టు పెట్టి బతుకమ్మ ఉత్సవాలను జరుపుకున్నామన్నారు.