మోడీపై 'తెలుగు' ఆగ్రహం: బీజేపీకి పవన్ 'తెలంగాణ' షాక్, కేసీఆర్ హ్యాపీ
మిర్చి రేటు అంశంపై తెలుగు రాష్ట్రాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్: మిర్చి రేటు అంశంపై తెలుగు రాష్ట్రాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఏపీలో అధికారంలో ఉన్న టిడిపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
చదవండి: జగన్కు ఈడీ మరో భారీ షాక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరోసారి మిర్చి సమస్యపై స్పందించారు. కేంద్రంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ మంత్రి హరీష్ రావు కేంద్రం పెంచిన ధరపై విమర్శలు చేశారు. ఏపీ మంత్రి సోమిరెడ్డి కూడా అసహనం వ్యక్తం చేశారు.
ఏపీతో పోలిస్తే తెలంగాణపై వివక్ష అని సంచలనం.. కేసీఆర్ హ్యాపీ
పవన్ కళ్యాణ్ మిర్చి రైతుకు మద్దతు ధర కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ కంటే తెలంగాణపై వివక్ష చూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెరాస నేతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కూడా అవే మాటలు చెప్పడం గమనార్హం. ఓ విధంగా ఇది తెరాసను సంతోషించపెట్టే విషయమే అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టవద్దని..
ఏపీలో 88,300 మెట్రిక్ టన్నులు కొంటున్న కేంద్రం, తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబు? తెలంగాణ రైతుల వద్ద ఇంకా లక్షల టన్నుల సరకు ఉందన్న సంగతి పాలకులు గుర్తించాలని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలనూ సమానంగా చూడాలన్నారు. తెలుగు ప్రజల మధ్య తగవులు పెట్టవద్దని జనసేన కోరుతోందని, రెండు రాష్ట్రాలలోను మద్దతు ధరను పెంచి, తెలంగాణలోనూ 88,300 మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాలని జనసేన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం గమనార్హం.
మర్మం ఉందా?
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రధానంగా ఏపీ పైనే దృష్టి సారించారు. తెలంగాణలోను పోటీ చేయవచ్చు. కానీ ఆయన దృష్టి అంతా ఏపీ పైనే ఉంది. కానీ, టిడిపి (ఏపీ నేతలు) - వైసిపిలా కాకుండా తెలంగాణ సమస్యలపై కూడా పవన్ స్పందించడం గమనార్హం. గతంలో సెక్షన్ 8 విషయంలోను తెలంగాణ వైపు పవన్ మాట్లాడారు. ఇప్పుడు మిర్చి విషయంలో ఏపీతో సమానంగా చూడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏమైనా ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే, పదవీ కాంక్ష లేకుండా కేవలం ప్రజా సమస్యల పైనే స్పందిస్తున్న పవన్ వ్యాఖ్యల్లో మరో భావన ఉండదనేదే ఎక్కువ మంది అభిప్రాయం. ఆయన ఏదైనా ముక్కుసూటిగా చెబుతారని అంటున్నారు.
మోడీ ప్రభుత్వంపై టిడిపి మంత్రి అసంతృప్తి
శుక్రవారం ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే ధర వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. ఎఫ్క్యూ మిర్చి ధర రూ.5 వేల కన్నా ఎక్కువ పలుకుతోందన్నారు.
హరీష్ రావు ఘాటుగా..
క్వింటాల్ మిర్చికి కేంద్రం రూ.5 వేలు చెల్లించాలని నిర్ణయించడాన్ని హరీష్ రావు కూడా తప్పుబట్టారు. తెలంగాణలో ఏడు లక్షల టన్నుల మిర్చి వస్తుందని, కేంద్రం మాత్రం 33వేల టన్నులు మాత్రమే కొనాలని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కేంద్రమంత్రికి ఆయన లేఖ కూడా రాశారు.
ఇదీ బీజేపీ వాదన..
మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ చెబుతోంది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి శుక్రవారం మాట్లాడారు. కేంద్రం రూ.5 వేలతో పాటు మరో రూ.1250 ఇస్తోందని, మొత్తం రూ.6250 ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు కోసం మరో రూ.3వేలు ఇస్తే ఏమిటని ప్రశ్నిస్తున్నారు.