టిడిపిని అధికారంలోకి తెచ్చే బాధ్యత నాదే: రేవంత్, బాబుతో 'పటిష్ట' ప్లాన్
కొడంగల్/హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని, ఆ బాధ్యత తనదేనని తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసన సభా పక్ష ఉపనేత, కొడంగల్ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు.
ఆయన మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లోని తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తన కుర్చూ ఊడుతుందని, ఎన్నికలు వస్తాయని కొందరు టిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ నేతలు ఎందరి పైన కేసులు లేవని ప్రశ్నించారు.
కేసులకు భయపడం
మంత్రి హరీష్ రావు అక్రమ సంపాదన పైన నిలదీస్తే గజ్వెల్, సంగారెడ్డి పోలీసు స్టేషన్లలో తన పైన అక్రమ కేసులు పెట్టారని వాటికి భయపడేది లేదని టిడిపి అధికార ప్రతినిధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆదివారం హైదరాబాదులో అన్నారు.
చంద్రబాబుతో తెలంగాణ టిడిపి నేతలు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టిడిపి నేతలు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల పైన ఆయన చర్చించారు.
నాగం ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి సోమవారం ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను సాధించాలనే తపనతోనే తాను టిడిపిని వదిలేశానని, ఆ తర్వాత బీజేపీలో చేరానని చెప్పారు.
బిజెపి రాజ్నాథ్ సింగ్ ఆహ్వానించడం వల్లే తాను ఆ పార్టీలో చేరానని, ప్రస్తుతం బీజేపీతో తనకు ఎలాంటి సమస్యలు లేవని. తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కూడా తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కానీ తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోనని చెప్పారు.
తెలంగాణ ఉన్నతి కోసమే తెలంగాణ బచావ్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీలోకి కాని, టీఆర్ఎస్లోకి కాని వెళ్లే ఆలోచన తనకు లేదన్నారు.
సిఎం కేసీఆర్ పాలన ప్రజల అభ్యున్నతికి అనుగుణంగా సాగడం లేదన్నారు. తాను టీడీపీ వీడి వచ్చినప్పుడు తనతో పాటు కొంతమంది వచ్చారని, మరో నలుగురు తన వెంట వచ్చి ఉంటే తెలంగాణలో పెను మార్పులు సంభవించి ఉండేవన్నారు. టీఆర్ఎస్ ఆహ్వానించినప్పటికీ తాను చేరలేదన్నారు.