తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ టీడీపీ పోటీ .. గెలిపించండి : నందమూరి సుహాసిని
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పంచాయితీ మొదలైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ పార్లమెంట్ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని అంతా భావించారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ . మొదట నుండి క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్న టీడీపీ తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది .
ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నందమూరి సుహాసిని . తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని నందమూరి సుహాసిని అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని, ఆ ఘనత ఎన్టీఆర్ కు చెందుతుందని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందేందుకు నారా చంద్రబాబునాయుడు తన హయాంలో ఎంతో కృషి చేశారని చెప్పారు.
అభివృద్ధి అంటే ఏంటో చూపించింది తెలుగుదేశం పార్టీ అని, అభివృద్ధిని కాంక్షించే వాళ్లందరూ, మహిళలందరూ కలిసి ముందడుగు వేసి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నందమూరి సుహాసిని పోస్ట్ చేశారు.పోగొట్టుకున్న చోటే తిరిగి సాధించుకోవాలన్న సిద్ధాంతాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయాలని టీ-టీడీపీ భావిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలుగుదేశం వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికీ తెలంగాణ అంతటా టీడీపీకి క్యాడర్ ఉందని అధినాయకత్వం భావిస్తోంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా అభ్యర్థులను బరిలోకి దించుతుంది.