టిక్కెట్లపై ఎక్కువ ఆశలొద్దు.. 18సీట్లతో సర్దుకుపోదాం, కాంగ్రెస్ గెలుపు ముఖ్యం!: బాబు షాకింగ్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఆదివారమే ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అవుతారని, అవసరమైతే కాంగ్రెస్ నేతలతోను మాట్లాడుతారని భావించారు. కానీ సోమవారం పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
బాలకృష్ణ కంటే ముందే జూ.ఎన్టీఆర్కు నారా బ్రాహ్మణి సర్ప్రైజ్ గిఫ్ట్, భావోద్వేగం
సీట్లపై మరీ ఆశలు పెట్టుకోకండి, అక్కడే పోటీ చేద్దాం
తొలుత పొలిట్ బ్యూరో సభ్యులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. మనకు పొత్తు ముఖ్యమని, సీట్లు కాదని, ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని తెలుగు తమ్ముళ్లకు సూచించారు. మన పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేద్దామని టీటీడీపీ నేతలతో చెప్పారు.
టిక్కెట్ రాకున్నా క్యాడర్ గెలుపు కోసం పని చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో చెప్పారు. మహాకూటమిలో భాగంగా మనకు చాలా చోట్ల సీట్లు రావని, మనకు టిక్కెట్ రాలేదని, ఊరుకోవద్దని, మన కూటమి క్యాడర్ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. కూటమి గెలుపు అంటే తెలంగాణలో కాంగ్రెస్దే అధికారం. ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉండే అవకాశం ఉంటుంది.
ఆ బాధ్యత ఎల్ రమణ, నామాలదే
పొత్తులో భాగంగా 2009లో టీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందో, ఎన్ని స్థానాలలో గెలిచిందో మనకు తెలుసు కదా అని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ నేతలకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావులదే అన్నారు.
కాంగ్రెస్తో పొత్తు ముఖ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ముఖ్యమని, ఆ పార్టీతో మనం సర్దుకుపోవాలని చంద్రబాబు సూచించారు. మనకు కాంగ్రెస్ 12 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, మరో ఆరు సీట్లు అడుగుదామని చెప్పారు. సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ పెద్దలతో తాను మాట్లాడుతానని చెప్పారు. ఆయన రాహుల్ గాంధీతో మాట్లాడే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. టిక్కెట్ రాని వారు అసంతృప్తికి గురి కావొద్దని, కూటమి గెలుపు కోసం కష్టపడాలన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రత్యామ్నాయ పదవులు వస్తాయన్నారు. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని చెప్పారు.
మీకు అండగా ఉంటా, టచ్లో ఉంటా
నేను తెలంగాణ టీడీపీ నేతలకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిత్యం మీతో టచ్లో ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల నుంచి స్వయంగా బయోడేటాలను తీసుకున్నారు. అలాగే, తెలంగాణలో ప్రచారానికి రావాలని నేతలు కోరారు. నాలుగు ప్రాంతాల్లో సభలు పెట్టాలని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కానీ ఆయన వచ్చే అవకాశాలు లేవు.