బాబు చెప్పిందే జరుగుతోంది: జగన్ ఒంటరి ఐతే 130 సీట్లు, కేసీఆర్ కలిస్తే 160 సీట్లు.. టీడీపీ లెక్కలు
అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి వస్తే తమకే లాభమని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వారు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కూటమిలో చేరే అంశంపై చర్చించారు. దీనిపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో కేసీఆర్ కలిస్తే తమకు ఏ మేరకు లాభం, జగన్ విడిగా వస్తే ఏ మేరకు లాభమనే అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా కేశినేని కూడా జగన్ ఒంటరిగా రావడం కంటే కేసీఆర్తో కలిసి వస్తే తమకు ఎక్కువ లాభమని చెబుతున్నారు. జగన్, కేసీఆర్ కలిసి కొత్తగా ఏమీ పని చేయడం లేదని, నాలుగేళ్లుగా, సంవత్సరకాలంగా పని చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు చెప్పిందే జరుగుతోంది
ఇంతవరకు తెరవెనుక ఉన్న కుట్ర ఇప్పుడిప్పుడే బయటకు వస్తోందని మంత్రి నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిందే జరుగుతోందన్నారు. జగన్, కేటీఆర్ల మధ్య చర్చలతో ఆ విషయం బట్టబయలైందన్నారు. ఏపీకి అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని వదిలేసి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న చంద్రబాబుపై దాడి చేస్తున్నారన్నారు. కేసుల మాఫీ కోసం మోడీతో జగన్ లాలూచి పడ్డారన్నారు. బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం ఏర్పడితేనే ఏపీకి మంచి జరుగుతుందన్నారు. మోడీని మళ్లీ ప్రధానిని చేసేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ను తెరపైకి తెచ్చారన్నారు. ముగ్గురు మోడీల డ్రామా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తోందన్నారు.
బురదజల్లేందుకు కేసీఆర్ సిద్ధం
కేసీఆర్తో పాటు అలాంటి పదిమంది వ్యక్తులు కలిసి వచ్చినా ఏపీలో తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి వచ్చి బురదజల్లేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్-వైసీపీలు దాదాపు ఏడాది క్రితం నుంచి కలిసి పని చేస్తున్నాయన్నారు. కొత్తగా ఇప్పుడేం కలవలేదన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి కోపం వస్తుందనీ, ఇప్పుడు కేసీఆర్కు వచ్చిందన్నారు.
షర్మిలను వ్యక్తిగతంగా విమర్శించలేదు
జగన్ సోదరి షర్మిలను తాను వ్యక్తిగతంగా విమర్శించలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు పవన్ రెడ్డి, తన సోదరుడు దివాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిలకు టికెట్లపై చంద్రబాబుతో ఇప్పటి వరకు చర్చించలేదని జేసీ ప్రభాకర్ రెడ్డిలు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించేందుకే ముఖ్యమంత్రితో భేటీ అయ్యామన్నారు.
జగన్ ఒంటరి అయితే 130 సీట్లు, కేసీఆర్ కలిస్తే 160 సీట్లు.. టీడీపీ లెక్క
కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అన్నది ఓ కిచిడి ఫ్రంట్ అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రధాని మోడీపై ప్రజలు ఎప్పుడో నమ్మకాన్ని కోల్పోయారన్నారు. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా జగన్తో టీఆర్ఎస్ చర్చలు జరపడం నిష్ప్రయోజనమన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో బీజేపీ అనుకూల, బీజేపీయేతర ఫ్రంట్ మాత్రమే ఉంటాయన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు వస్తాయన్నారు. అదే జగన్ తరఫున కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తే మరో 30 స్థానాలు ఎక్కువగా వస్తాయని, అంటే టీడీపీ 160 సీట్లు గెలుచుకుంటుందన్నారు. లోకసభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ కేవలం 130 స్థానాలకు పరిమితమవుతుందని చెప్పారు. కేసీఆర్ ద్వారా మోడీకి జగన్ మద్దతు ఇవ్వబోతున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట భేటీ అందులో భాగమే అన్నారు. కేసీఆర్, జగన్ కలిసి ఏపీ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ స్వాగతిస్తుందన్నారని ఎద్దేవా చేశారు.