జాతీయపార్టీగా తొలి గెలుపు: పోర్ట్ బ్లెయిర్లో టిడిపి సత్తా, బిజెపితో కలిసి మేయర్?
హైదరాబాద్: అండమాన్ నికోబర్లోని పోర్ట్ బ్లెయిర్ నగర పాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు వెలువడిన 12 వార్డుల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ పలు వార్డులను కైవసం చేసుకుంది.
పోర్టు బ్లెయిర్ నగర పాలక సంస్థ ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు మంగళవారం నాడు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ పన్నెండు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో రెండు వార్డుల్లో (5, 6) వార్డుల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు.
భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1, ఏఐఏడీఎంకే 1, డీఎంకే 1, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. మరో 12 వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. టిడిపితో కలిసి బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని తెలుస్తోంది.
ఈ రెండు పార్టీల కూటమికి సాధారణ మెజారిటీ దక్కాలంటే, మరో 5 వార్డుల్లో బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీఅభ్యర్థులు విజయం సాధించాల్సి ఉంటుంది. టిడిపి - బిజెపిలు కలిసి ఇప్పటికే 8 స్థానాల్లో గెలిచాయి. మరో ఐదు స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది.
జాతీయపార్టీగా టిడిపికి తొలి విజయం: చినరాజప్ప
పోర్ట్బ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి సత్తా చాటడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. జాతీయపార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ఇది తొలి విజయమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో టిడిపి బలీయమైన శక్తిగా అభివృద్ధి చెందుతోందన్నారు. టిడిపిని త్వరలోనే ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామన్నారు.