తెలుగుదేశం మహిళా నేత దారుణహత్య: కుమార్తె చూస్తుండగానే..
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలుగుదేశం మహిళా నేత దారుణ హత్యకు గురైంది. కుమార్తె చూస్తుండగానే గుర్తు తెలియని దుండగులు ఆమె తలనరికి హత్య చేశారు. ఆపై ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలతో పారిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. కాటారం మండలం తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు రామిల్ల కవిత(30), పదేళ్ల క్రితం భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటూ బతుకుతోంది.
బంధువుల వివాహ వేడుక కోసం కవిత ఆదివారం మంథని వెళ్లారు. పిల్లలతో కలిసి వెళ్లిన కవిత.. వివాహానంతరం చిన్న కుమార్తెను వధువుకు తోడుగా ఉంచి, పెద్ద కుమార్తెతో ఇంటికి వచ్చారు. అదేరోజు రాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. కవిత కుమార్తె చేతులు కట్టేసి బంధించారు.
అనంతరం కత్తిపీటతో కవిత తలనరికి హత్య చేశారు. కుమార్తె కళ్లెదుటే ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఆపై ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలతో పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.