కొత్త సెంటిమెంట్లు రేవంత్ కు కలిసివస్తాయా
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ సెంటిమెంట్లను నమ్ముతున్నారు. సెంటిమెంట్ ప్రకారంగానే కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ వేదికపైనే రేవంత్ తన సెంటిమెంట్ అంశాన్ని ప్రకటించారు.ఉమ్మడి ఆంద్రప
హైదరాబాద్ :తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ సెంటిమెంట్లను నమ్ముతున్నారు. సెంటిమెంట్ ప్రకారంగానే కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ వేదికపైనే రేవంత్ తన సెంటిమెంట్ అంశాన్ని ప్రకటించారు.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుసరించిన సెంటిమెంట్ సూత్రాన్ని రేవంత్ కూడ ఫాలో అవుతున్నారు. నాడు వైఎస్ కు కలిసొచ్చిన సెంటిమెంట్ నేడు రేవంత్ కు కలిసివస్తోందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయనాయకులు కొందరు సెంటిమెంట్లను నమ్ముతారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కువ సెంటిమెంట్లను నమ్ముతారు. ఎపి చంద్రబాబునాయుడు సెంటిమెంట్లను విశ్వసిస్తారు. ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుండి ప్రారంభించడం చంద్రబాబుకు అలవాటు. తిరుపతిలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కలిసివస్తోందని బాబుతో సహా పార్టీ సీనియర్లు విశ్వసిస్తారు. ఎన్ టి ఆర్ బతికున్న కాలంలో కూడ ఇదే పద్దతిని అనుసరించారు.
ఎన్ టి ఆర్ కు కూడ సెంటిమెంట్ ను విశ్వసిస్తారు.జ్యోతిష్యాన్ని కూడ ఆయన బాగా నమ్ముతారు.కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నుండి ప్రాతినిథ్యం వహించిన బివి మోహన్ రెడ్డి చెప్పే జ్యోతిష్యంపై ఎన్ టి ఆర్ నమ్మేవారని పార్టీ నాయకులు చెబుతుంటారు.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో వైఎస్ ముఖ్యమంత్రిగా, విపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నుండి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆయనకు అలవాటు. ఈ సెంటిమెంట్ కూడ ఆయనకు కలిసివచ్చిందని పార్టీ నాయకులు అభిప్రాయపడతారు అందుకే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవేళ్ళ చెల్లెమ్మగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడ ఈ సెంటిమెంట్ల ప్రభావం తగ్గలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త కార్యక్రమం, పథకం ప్రారంభించాలంటే ముహుర్తాలు, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకొంటారు.వాస్తును కూడ ఆయన విశ్వసిస్తారు.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడ సెంటిమెంట్లను విశ్వసిస్తారు. తొలుత ఆయన జడ్ పి టి సి గా పోటీచేసిన సమయంలో ఉపయోగించిన క్వాలీస్ వాహనాన్ని ఎన్నికల ప్రచారం లో ఉపయోగిస్తారు. ఈ వాహనంలో ప్రచారం నిర్వహించడం తనకు కలిసివచ్చిందని ఆయన విశ్వసిస్తారు. జడ్ పి టి సి ఎన్నికల్లో విజయం సాధించాడు. తర్వాత జరిగిన ఎం ఏల్ సి ఎన్నికల్లో కూడ ఆయన విజయం సాధించారు.2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సమయంలో కూడ ఇదే వాహానాన్ని ఉపయోగించారు. విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడ అదే ఫలితం పునరావృతమైంది.
కొత్త సెంటిమెంట్ ను ఫాలోఅవుతున్న రేవంత్
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎల్ పి నాయకుడిగా వ్యవహారించిన మాజీ మంత్రి పి. జనార్థన్ రెడ్డికి సెంటిమెంట్ ఎక్కువ. జూబ్లిహిల్స్ లోని పెద్దమ్మ దేవాలయంలో పూజటు నిర్వహించి కార్యక్రమాలను నిర్వహించేవారు. టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడ పార్టీ తెలంగాణ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పెద్దమ్మ గుడి నుండి పార్టీ కార్యాలయం వరకు సైకిల్ పై వెళ్ళాడు. ఏ కార్యక్రమానైనా పెద్దమ్మ గుడి నుండి ప్రారంభిస్తానని రేవంత్ ప్రకటించారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు ముందుగా ఆయన ప్రతి జిల్లాలో ఒక్క రోజున సుమారు 15 నుండి 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతుల సమస్యలను తెలుసుకొన్నారు. ఇదే పద్దతిలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడ తెలంగాణ జిల్లాల్లో రైతుల సమస్యలపై ఒక్క రోజు పాదయాత్ర నిర్వహిస్తున్నారు.అన్ని ఈ యాత్రల తర్వాత సుదీర్ఘంగా పాదయాత్రకు కూడ ఆయన సన్నాహలు చేసుకొనే అవకాశం కన్పిస్తోంది.
వైఎస్ సెంటిమెంట్ రేవంత్ కు కలిసి వస్తోందా..
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ విపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నుండి 2003 లో పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర కారణంగానే 2004 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చేవేళ్ళ నుండి కార్యక్రమాలను ప్రారంభించడం సెంటిమెంట్.అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించినా చేవేళ్ళ నుండే ప్రారంభించేవారు. అంతేకాదు 2009 ఎన్నికల ప్రచారాన్ని కూడ ఆయన చేవేళ్ళ నుండి ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ విజయం సాధించింది.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఎస్ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు కీలకమైన హోంమంత్రిత్వశాఖను కూడ అప్పగించారు.
ఇదే తరహలో రేవంత్ కూడ సెంటిమెంట్ ను నమ్ముతున్నారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన రైతు పోరుయాత్ర సందర్భంగా మాజీ ఎం ఏల్ ఏ సీతక్క రేవంత్ కు తిలకం దిద్ది యాత్రను ప్రారంభింపజేశారు.నాడు వైఎస్ కు సబితక్క తరహలోనే...తనకు సీతక్క అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన రైతుపోరు యాత్ర సభలో రేవంత్ ఈ అంశాన్ని స్వయంగా ప్రకటించారు.వైఎస్ కు కలిసొచ్చిన సెంటిమెంట్....రేవంత్ కు కలిసి వస్తోందా చూడాలి.