గులాబీ బాస్ కు టీచర్లు షాక్ ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి విజయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. గులాబీ బాస్ కెసిఆర్ కు టీచర్లు గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తనకు తిరుగులేదని భావించిన టిఆర్ఎస్ పార్టీ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం షాక్ తగిలింది.
ఇటీవల జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నల్లగొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి తొమ్మిది మంది పోటీ పడ్డారు. గత ఎన్నికల్లో వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పూల రవీందర్ ప్రాతినిధ్యం వహించారు. కానీ ఈ దఫా ఆయన యుటిఎఫ్ అభ్యర్ధి నర్సిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ మూడు జిల్లాలలో కలిసి మొత్తం 18885 ఓట్లు పోలవగా అందులో 858 ఓట్లు చెల్లకుండాపోయాయి. మిగతా 18027 ఓట్లలో నర్సిరెడ్డికి 8924, పూల రవీందర్ కు 6287,సరోత్తమ్ రెడ్డి 1873 ఓట్లు వచ్చాయి. గతంలో నర్సిరెడ్డి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇందులో టీఆర్ఎస్ బలపర్చిన పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్పై టీఎస్ యూటీఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. ఏకంగా 2637 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. గెలుపొందిన యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8924 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్కు 6287 ఓట్లు వచ్చాయి.
రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లోనూ దూకుడు చూపించాలనుకున్న అధికార పార్టీ బలపర్చిన అభ్యర్ధిపై సిపిఎం మద్దతిచ్చిన నర్సిరెడ్డి విజయం సాధించడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి టీచర్లు అధికార పార్టీకి తమ ఓటు తో గట్టి షాక్ ఇచ్చారు అని ప్రధానంగా చర్చ జరుగుతోంది.