వేసవిలోనే బదిలీలు, సీపీఎస్పై ఉద్యోగులకు మేలైన నిర్ణయం: వన్ఇండియాతో పాతూరి
హైదరాబాద్:వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పూర్తయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఏకీకృత సర్వీస్ రూల్స్పై కోర్టు స్టే ఎత్తివేస్తే దానికనుగుణంగా బదిలీలు జరుగుతాయన్నారు. ఒకవేళ స్టే ఎత్తివేయకపోతే పాత పద్దతిలోనే బదిలీలు కొనసాగే అవకాశం ఉందన్నారు.మరోవైపు సీపీఎస్ పై ఉద్యోగులకు నష్టం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు.
గురువారం నాడు ఆయన వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని చెప్పారు.
సీపీఎస్ విధానం విషయంలో కొందరు రాజకీయ ఉద్దేశ్యంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోదని ఆయన చెప్పారు.
స్టేతో బదిలీలకు లింక్
ఏకీకృత సర్వీస్ రూల్స్పై కొందరు హైకోర్టును ఆశ్రయించారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 30వ తేదిన కోర్టు స్టే ఎత్తివేస్తే ఏకీకృత సర్వీస్ రూల్స్కు అనుగుణంగా బదిలీలు జరిగే అవకాశం ఉందన్నారు. ఒకవేళ స్టే ఎత్తివేయకపోతే పాత పద్దతిలోనే బదిలీలు ఉంటాయని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం లేకుండా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని ఆయన చెప్పారు.
పీఆర్సీ కమిషన్పై
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేస్తోందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి చెప్పారు. 2018 జూలై 1వ తేది నాటికి పీఆర్సి కమిషన్ గడువు పూర్తి కానుందన్నారు. అయితే ఈ గడువు పూర్తయ్యేలోపుగా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుండి వస్తోంది.ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన చెప్పారు. కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐఆర్ విషయమై కూడ ఉద్యోగుల నుండి డిమాండ్ ఉన్న విషయం సర్కార్ దృష్టిలో ఉందన్నారు.
సీపీఎస్పై ఉద్యోగులకు మేలైన నిర్ణయం
సీపీఎస్ విధానంపై ఉద్యోగులకు నష్టం వాటిల్లేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ పాతూరి సుధాకర్ రెడ్డి చెప్పారు.2004లో ఎన్డీఏ ప్రభుత్వం దిగిపోయే ముందు ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రభుత్వానికి చట్టాలను అడాప్ట్ చేసుకొన్నట్టుగానే ఈ స్కీమ్ కూడ అడాప్ట్ చేసుకొన్నామని చెప్పారు. అయితే ఈ స్కీమ్ నుండి వైదొలిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. అయితే ఛత్తీస్ఘడ్, తమిళనాడు రాష్ట్రాలు కూడ ఈ పథకం నుండి వెనక్కు తగ్గాలని భావిస్తున్నాయన్నారు. ఆ రాష్ట్రాలు ఏం చేస్తాయో పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకొంటామని సుధాకర్ రెడ్డి చెప్పారు.
ప్రైవేట్ యూనివర్శిటీలతో నష్టం లేదు
ప్రభుత్వ యూనివర్శిటీలను బలోపేతం చేస్తూనే ప్రైవేట్ యూనివర్శిటీలతో పోటీని పెంచుతామన్నారు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ పాతూరి సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీలను తీసుకురావడం వల్ల ప్రభుత్వ యూనివర్శిటీలను నిర్వీర్యం చేస్తామని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.