నయీంకు ఆయుధాలు, ఎవరీ టెక్ మధు: ఒంగోలు షెల్టర్ జోన్
హైదరాబాద్: నయీంతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అరెస్టయిన అశోక్ అలియాస్ టెక్ మధుపై ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. శుక్రవారంనాడు అతన్ని పోలీసులు అరెస్టు చేసి నల్లగొండ జిల్లా ఆలేరు కోర్టులో హాజరు పరిచారు. తన దందా కోసం నయీం అత్యాధునిక ఆయుధాలు వాడినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
నయీం స్థావరాల నుంచి అధికారులు స్టెన్ గన్లు, ఎకె 47, తపంచాలు, జిలెటెన్ స్టిక్స్, డిటొనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీం కేసులో హైదరాబాదు వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో టెక్ మధు 16వ నిందితుడిగా ఉన్నాడు. గతంలో టెక్ మధు మావోయిస్టులకు రాకెట్ లాంఛర్లు సరఫరా చేసేవాడు.
ప్రకాశం జిల్లా ఒంగోలును నయీం షెల్టర్ జోన్గా వాడుకునేవాడని సమాచారం. నక్సలైట్లు కూడా ఆ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా వాడుకునేవారు. మాజీ నక్సలైట్ అయిన నయీం ఆ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన సమీప బంధువు ఒకరిని ఒంగోలులో ఉంచి అప్పుడప్పుడూ వచ్చిపోతుండే వాడని అనుమానిస్తున్నారు.
కొంతకాలం క్రితం ఒంగోలుకు వచ్చి తాత్కాలిక స్థిర నివాసం ఏర్పరచుకున్న నయీం సమీప బంధువు సలీంను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులోని మంగమూరు రోడ్డు శివారులో ఉన్న ఓ అపార్ట్మెంట్ను సలీం అనే వ్యక్తి ఏకమొత్తంలో డబ్బులు చెల్లించి కొనేశాడు.
అంతకుముందు సలీం అనే వ్యక్తి అక్కడ ఎవరికీ తెలియదు. తాను హైదరాబాద్ వాసినని, వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చానని అతను చెప్పేవాడని అంటున్నారు. సలీం విలాసవంతమైన జీవితం గడిపేవాడని అంటున్నారు. అప్పుడప్పుడు ఎవరికీ కనిపించకుండా పోయేవాడని కూడా అంటున్నారు. షటిల్ క్రీడాకారుడైన సలీం ఒంగోలులోని క్రీడాకారులతోనూ పరిచయాలు పెంచుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
నయీం మృతదేహం దగ్గర తారసపడిన సలీంను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్కు నాలుగు రోజుల ముందు వరకూ నయీం ఒంగోలులో సలీం దగ్గర తల దాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.