భార్యకు తలాఖ్: కోర్టు ఆవరణలో న్యాయవాదిని కొట్టిన టెక్కీ
హైదరాబాద్: అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఓ టెక్కీ నాంపల్లి ఫ్యామిలీ కోర్టు ఆవరణలో ఓ న్యాయవాదిని కొట్టాడు. మంగళవారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. తన భార్య దాఖలు చేసిన మెయింటెనెన్స్ కేసును ఆ న్యాయవాది వాదిస్తున్నాడు. ఆ న్యాయవాది తీరుతో చిర్రెత్తి చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిర్యాదుదారు అయిన మహిళ 2003లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొహ్మద్ అబ్దుల్ లయీఖ్ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఏడాదే వారు అమెరికా వెళ్లారు. ఐదేళ్ల తర్వాత 2009లో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.
లయీఖ్ భార్యకు 2010లో తలాఖ్ చెప్పాడు. దాంతో భార్య ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసింది. వేధింపులు, గృహహింసల కింద మరో కేసును కూడా ఆమె దాఖలు చేసింది. లయీఖ్ పిల్లలను శాశ్వతంగా తనకు అప్పగించాలని పిటిషన్ వేశాడు.
న్యాయవాది సయ్యద్ లతీఫ్ భార్య తరఫున కేసును వాదిస్తున్నారు. ఫ్యామిలీ కోర్టులోని అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు మంగళవారం విచారణకు వచ్చింది. ఇరు పార్టీలను కోర్టులోకి పిలువగానే లయీఖ్ తన తరఫున వాదించడానికి ఓ జూనియర్ అడ్వొకేట్ను ప్రవేశపెట్టాడు. దాన్ని లతీఫ్ వ్యతిరేకించారు.
లయీఖ్ విజ్ఞప్తిని జడ్జి అంగీకరించకుండా కేసును 2016 జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు. కోర్టు నుంచి బయటకు రాగానే లయీక్ లతీఫ్పై దాడి చేశాడు. తాను తన పిటిషనర్తో మాట్లాడుతుండగా లయీఖ్ వెనక నుంచి వచ్చి మెడపై, వీపుపై కొట్టాడని లతీఫ్ చెబుతున్నారు. ఈ ఘటనపై లతీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.