లేడీ టెక్కీ ఆత్మహత్య: భర్త వేధింపులతో తీవ్ర నిర్ణయం
భర్త వేధింపులు భరించలేక హైదరాబాదులో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆత్మహత్య చేసుకుంది. చున్నీతో ఉరేసుకుని చనిపోయింది.
హైదరాబాద్: ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీరు బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇంక్పాడ్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాదులోని వెంగళరావు నగర్ డివిజన్ రాజీవ్నగర్లో సోమవారం చోటు చేసుకుంది.
మచిలీపట్నానికి చెందిన సూరారపు బ్రహ్మయ్య కూతురు భార్గవి(25)ని విశాఖపట్నానికి చెందిన ఉమ్మడిశెట్టి నరేంద్రకు ఇచ్చి నిరుడు మార్చి 20వ తేదీన వివాహం చేశారు. రూ. 25లక్షలు, 20 తులాల బంగారు ఆభరణాలు, ఆదిభట్లలో ఓ ప్లాట్ కట్నంగా ఇచ్చారు. పెళ్లయిన నెలకే నగరం వచ్చి రాజీవ్నగర్లో నివసిస్తున్నారు.
నరేంద్ర మధురానగర్లోని వామన కన్సెల్టెన్సీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. అదనపు కట్నం కావాలని భార్యను గత ఐదు నెలల నుంచి వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. భార్గవి ఈ విషయాన్ని ఎల్లాఎడ్డిగూడలో ఉంటున్న తండ్రి బ్రహ్మయ్యకు చెప్పింది. దాంతోో ఐదు లక్షల రూపాయలను అదనంగా ఇచ్చాడు. ఆదివారం రాత్రి భార్యాభర్త లిద్దరూ గొడవపడ్డారు. మరింత కట్నం కావాలంటూ మానసికంగా, శారీరకంగా భర్త వేధిస్తున్నాడని భార్గవి రోదిస్తూ తండ్రికి చెప్పింది.
సోమవారం ఉదయం భర్త నరేంద్ర బయటకు వెళ్లగానే ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుంది. తాను చనిపోతున్నట్టు బంధువులకు అంతకుముందు ఫోన్చేసి చెప్పింది. పక్కనే ఉంటున్న బంధువు వచ్చి తలుపు కొట్టగా తీయలేదు. చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు తెరిచి చూడగా భార్గవి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది.
మృతురాలి తండ్రి బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నరేంద్ర పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.