ప్రేమించి, పెళ్లైన కొద్ది రోజులకే ఆస్తి కోసం వేధింపులు, అందుకే టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆర్నెళ్లకే మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ రూపిణి ఆత్మహత్య కలకలం రేపింది. ప్రేమికుడు భర్తగా మారాక డబ్బులు తేవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. అందుకు అత్తామామలు వత్తాసు పలికారు. ప్రేమ పెళ్లి పేరుతో పైసా కట్నం లేకుండా వచ్చావని, మీ నాన్నకు ఇద్దరు ఆడపిల్లలేనని, తండ్రి ఆస్తిలో సగం వాటా తీసుకు రావాలని వేధించారు.
వేధింపులు, హైదరాబాద్లో ఏలూరు మహిళా టెక్కీ ఆత్మహత్య, పోలీసుల అదుపులో భర్త
వారి వేధింపులు తాళలేక రూపిణి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. సందీప్, రూపిణిలు రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు ఆర్నెళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ గోదావరి ఏలూరుకు చెందిన మురళీకృష్ణ కుటుంబం, చంద్రాల సత్యనారాయణ-లలిత దంపతుల కుటుంబాలు పక్కపక్కనే.
ప్రేమించి, తండ్రిని ఒప్పించింది
మురళీకృష్ణకు ఇధ్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రూపిణి. సత్యనారాయణ కొడుకు సందీప్ స్నేహితుడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య రెండేళ్ల క్రితం ప్రేమ ఏర్పడింది. రూపిణి బీటెక్ చేసి క్యాప్ జెమినీలో ఉద్యోగం చేస్తున్నారు. చందానగర్లోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ జాబ్ చేస్తున్నారు. సందీప్, రూపిణిలు తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పారు. తొలుత రూపిణి పేరెంట్స్ అంగీకరించలేదు. తర్వాత కూతురు మనసు కాదనలేక అంగీకరించారు.
కాపురం పెట్టాక వేధింపులు
ఈ ఏడాది మార్చి 4వ తేదీన అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ నుంచి చిత్రపురి కాలనీలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. సందీప్ మణికొండలోని ఓ జిమ్లో జిమ్ మాస్టర్గా పని చేస్తున్నాడు. కాపురం పెట్టాక భార్య రూపిణిని వేధించడం ప్రారంభించాడు. కట్నం తీసుకు రాలేదని, తండ్రి ఆస్తిలో సగం వాటా రాయించుకు రావాలని చెప్పేవాడు. అత్తామామలు వత్తాసు పలికారు.
నచ్చచెప్పినా వినలేదు
రెండు నెలల క్రితం ఇంట్లో జరుగుతున్న విషయాలను రూపిణి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. బంధువులతో కలిసి వచ్చి కూతురుకు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పారు. అయినా వేధింపులు కొనసాగాయి. గత బుధవారం కూడా మురళీకృష్ణ వచ్చి అల్లుడు, అత్తింటి వారికి నచ్చ చెప్పి వెళ్లారు. శనివారం రూపిణి పేరెంట్స్కు ఫోన్ చేసి తనను ఆస్తి కోసం చంపేలా ఉన్నారని తండ్రికి చెప్పింది.
గదిలో ఉరేసుకొని ఆత్మహత్య
దీంతో తండ్రి వెంటనే బయలుదేరి వచ్చాడు. శనివారం రాత్రి వచ్చాడు. ఆదివారం ఉదయం అత్తామామలు బయటకు వెళ్లారు. సందీప్ జిమ్కు వెళ్లాడు. తండ్రి మురళీకృష్ణ టిఫిన్ తెచ్చేందుకు వెళ్లాడు. తిరిగి పది గంటలకు వచ్చారు. అప్పుడు కూతురు ఎంతకూ తలుపు తీయలేదు. తలుపులు బద్దలు కొట్టి చూడటంతో గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం పొట్టన పెట్టుకున్నారు
తన కూతురు చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైనదని, బీటెక్ పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం వచ్చిందని, మాయమాటలతో వలలో వేసుకున్నాడని, నేను వద్దని చెప్పినా, తనను ఒప్పించిందని, కానీ పెళ్లైన నెల రోజులకే కట్నం కోసం విధించారని, ఇద్దరు కూతుళ్లు కావడంతో సగం వాటా ఇస్తానని చెప్పినా వినలేదని, ఆస్తి కోసం నా కూతురును పొట్టన పెట్టుకున్నారని మురళీకృష్ణ కన్నీరుమున్నీరు అయ్యారు.