ఈ మహిళా టెక్కీ బ్రెయిన్ డెడ్: అవయవాల దానం
హైదరాబాద్: తీవ్రమైన తలనొప్పితో ఓ మహిళా టెక్కీ మృత్యువాత పడింది. బాల్యం నుంచే కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఎదిగిన ఆ యువతిని అకాలంగా మృత్యువు పొట్టన పెట్టుకుంది. రంగారెడ్డి జిల్లా అంబర్పేట్లోని న్యూపటేల్నగర్కు చెందిన బి.దశరథ రాజు దంపతుల కుమార్తె బి. శిరీష.
ఆ 26 ఏళ్ల టెక్కీ 4పీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. నాలుగు రోజుల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమెను హైదరాబాదులోని హైదర్గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు హైడ్రోసిఫలస్ వ్యాధితో ఉందని, మెదడులో నీరు చేరిందన్నారు.
చికిత్స నిర్వహిస్తుండగానే గురువారం బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు తెలిపారు. తండ్రి దశరథరాజు, సోదరులు బి. యాదగిరి, లోకేశ్ రాజుకు అవయవదానం విశిష్టతపై వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో అవయవదానానికి ఒప్పుకున్నారు. శీరిష నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించారు.