అర్ధరాత్రి హైదరాబాద్ రోడ్లపై టెక్కీల వీరంగం
హైదరాబాద్: కొందరు సాఫ్టువేర్ ఇంజనీర్లు ఆదివారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వీరంగం సృష్టించారు. బాగా మందుకొట్టి వారు హంగామా చేశారు. క్యాబ్ విషయంలో టెక్కీలు గొడవ పడ్డారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
భార్యను చంపిన భర్త
హైదరాబాదులోని రామంతూపూర్లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందింది. పోలీసులు నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు.
దుకాణాలపై దూసుకెళ్లిన లారీ: ఒకరు మృతి
నిజామాబాద్ జిల్లాలోని పిట్లం మండలం చిన్న కొడప్గల్లులో ఓ లారీ ప్రమాదవశాత్తు దుకాణాల పైకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. రెండు దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సవతి తల్లి చేతిలో బాలుడి హత్య
అదిలాబాద్ జిల్లాలో సవతి తల్లి చేతిలో ఓ బాలుడు హత్యకు గురయ్యాడు. రెబ్బెనకు చెందిన పిట్టల ప్రభాకర్కు మొదటి భార్య ద్వారా ఆరేళ్ల వయసున్న కుమారుడు జయసూర్య ఉన్నాడు. మొదటి భార్య మృతి చెందడంతో ఆరు నెలల క్రితం ప్రభాకర్ సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనకు పుట్టబోయే పిల్లలకు జయసూర్య అడ్డుగా ఉంటాడని భావించిన సునీత, అతడిని అంతమొందించేందుకు నిర్ణయించుకుంది.
ఈ నెల 16న భర్త మంచిర్యాలకు వెళ్లాడు. భర్త తల్లి ఉపాధి హామీ పనులకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సునీత జయసూర్యను గొంతు నులిమి చంపేసింది. అనంతరం బాత్రూంలో జారి పడి మృతి చెందాడని అందరినీ నమ్మించింది.
అంత్యక్రియల అనంతరం సునీత ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన ప్రభాకర్ శనివారం ఆమెను నిలదీయడంతో జయసూర్యను తానే హత్య చేశానని సునీత ఒప్పుకుంది. దీంతో ప్రభాకర్, సునీతపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడి గొంతుపై గట్టిగా నులిమినట్లు గుర్తులు, గాయాలు ఉన్నాయని చెప్పారు.